Kurnool: నూతన కార్యాలయ పనులు ముమ్మరం చేయాలి
Kurnool: కర్నూలు నగరపాలక సంస్థ నూతన కార్యాలయ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు.
Kurnool: నూతన కార్యాలయ పనులు ముమ్మరం చేయాలి
కర్నూలు: నగర పాలక సంస్థ నూతన కార్యాలయ నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన ఎన్ఆర్ పేటలోని పాత కార్యాలయ భవనాన్ని పరిశీలించి, అక్కడ ఇంకా మిగిలి ఉన్న పాత దస్త్రాలు, ఫర్నిచర్, ఇతర సామాగ్రిని వెంటనే తరలించాలని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో పాత కార్యాలయం పూర్తిగా ఖాళీ కావాలని, ఎలాంటి సామాగ్రి అక్కడ మిగలకూడదని సూచించారు. నూతన కార్యాలయ నిర్మాణానికి ఆటంకం కలగకుండా త్వరలోనే పాత కార్యాలయ భవనాన్ని కూల్చివేయనున్నట్లు తెలిపారు.
గుత్తేదారుడికి బిల్లుల చెల్లింపుల ఆలస్యం కారణంగా నిర్మాణ పనులు నిలిచాయని, ఇటీవలే రూ.3.65 కోట్ల బిల్లులు మంజూరు చేసినందున ఇకపై పనులు మరింత ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆధునిక సౌకర్యాలతో కూడిన నూతన కార్యాలయం వీలైనంత త్వరగా అందుబాటులోకి రావాలని కమిషనర్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఎస్ఈ రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, ఎంఈలు మనోహర్ రెడ్డి, గిరిరాజ్ తదితర అధికారులు పాల్గొన్నారు.




