Atmakur: నల్లమల చెంచులకు రెడ్ క్రాస్ వైద్య శిబిరం
Atmakur: ఆత్మకూరు కురుకుంద చెంచుగూడెంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చెంచు గిరిజనులకు వైద్య శిబిరం నిర్వహించారు.
Atmakur
నంద్యాల జిల్లా ఆత్మకూరు పరిధిలోని కురుకుంద చెంచుగూడెంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చెంచు గిరిజనులకు వైద్య శిబిరం నిర్వహించారు.
ప్రపంచ రెడ్ క్రాస్ సొసైటీ, తలసేమియా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆత్మకూరు శాఖ చైర్మన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నల్లమల చెంచు గిరిజనుల్లో ఆయుష్షు ప్రమాణాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీవన విధానంలో మార్పులు, ఆహారపు అలవాట్ల మార్పులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు.
చెంచు గిరిజనుల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, పురుషుల్లో మద్యపాన వ్యసనం పెరగడం వల్ల మరణాలు అధికమవుతున్నాయని పేర్కొన్నారు. మహిళల్లో రక్తహీనత సమస్య పెరగడంతో మరణాల రేటు అధికమై చెంచు జాతి అంతరించే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
వైద్య శిబిరంలో చెంచు గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. అనంతరం గూడెంలోని గిరిజనులకు భోజన సదుపాయం కల్పించారు.




