Nandikotkur: నిర్మాణం పూర్తయినా ప్రారంభమేది.. షాదీఖానాపై వైఎస్ఆర్సీపీ ధ్వజం
Nandikotkur: నందికొట్కూరులో నిర్మాణం పూర్తయిన షాదీఖానాను ప్రారంభించకుండా జాప్యం చేయడంపై వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డా. సుధీర్ దారా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nandikotkur: నిర్మాణం పూర్తయినా ప్రారంభమేది.. షాదీఖానాపై వైఎస్ఆర్సీపీ ధ్వజం
నందికొట్కూరు: రూ.1.50 కోట్లతో నిర్మాణం పూర్తయిన షాదిఖాన నూతన భవనాన్ని ప్రారంభించకుండా జాప్యం చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నందికొట్కూరు సమన్వయకర్త డా.సుధీర్ దారా మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని షాదిఖానను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా డా.సుధీర్ దారా మాట్లాడుతూ 1998లో టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి స్పీకర్ ఫరూక్ శిలాఫలకం వేశారని, మళ్లీ 2014లో కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండోసారి శిలాఫలకం వేసి వదిలేశారని తెలిపారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి విజ్ఞప్తి మేరకు సీఎం జగన్ రూ.1.50 కోట్లు మంజూరు చేయడంతో షాదిఖాన నిర్మాణం పూర్తయిందన్నారు.
ముస్లిం మైనారిటీలకు, పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం షాదిఖానను పూర్తి చేసిందని, అయితే అన్ని పనులు పూర్తయినా ప్రస్తుత ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించడం లేదని విమర్శించారు. కమిటీల పేరుతో జాప్యం చేసి టీడీపీ ప్రభుత్వం మైనారిటీలను మోసం చేస్తోందని ఆరోపించారు.
రాజకీయాలకు అతీతంగా షాదిఖానను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మైనారిటీలకు అండగా ఉంటూ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు.




