Nandyal: కాశ్మీర్ సరిహద్దు నుండి సైనికుడి ఆర్తనాదం: నా భూమి కాపాడండి!
Nandyal: సైనికుడు భాష్యం మహేష్ జమ్మూ-కాశ్మీర్ సరిహద్దుల నుండి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తన 2.38 ఎకరాల భూమి కబ్జాపై సీఎం, డిప్యూటీ సీఎంల సాయం కోరారు.
Nandyal: కాశ్మీర్ సరిహద్దు నుండి సైనికుడి ఆర్తనాదం: నా భూమి కాపాడండి!
Nandyal: దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న ఓ సైనికుడు… ఇప్పుడు తన సొంత ఊరిలో భూమి కాపాడుకోవడానికి న్యాయం కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. నంద్యాల జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. తన వ్యవసాయ భూమిని అక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఓ సైనికుడు సెల్ఫీ వీడియో విడుదల చేసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఆశ్రయించాడు.
నంద్యాల జిల్లా మహానంది మండలంలోని తమ్మడపల్లె గ్రామానికి చెందిన సైనికుడు భాష్యం మహేష్ ప్రస్తుతం జమ్మూ-కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నారు.
అయితే దేశ రక్షణలో ఉన్న తనకు స్వగ్రామంలో ఉన్న వ్యవసాయ భూమి రక్షణపై ఆందోళన నెలకొన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ్మడపల్లె గ్రామ పరిధిలో తనకు చెందిన 2.38 ఎకరాల వ్యవసాయ భూమిని అక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఈ వ్యవహారంలో మహానంది మండల టీడీపీ అధ్యక్షుడు కంచర్ల శివ పేరును ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. తన భూమిని కాపాడాలని, జరుగుతున్న పరిణామాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కోరారు.
సెల్ఫీ వీడియో ద్వారా తన గోడును బయటపెట్టిన భాష్యం మహేష్… “నేను దేశం కోసం సరిహద్దుల్లో సేవ చేస్తున్నాను… నా కుటుంబ ఆస్తిని కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉంది” అంటూ భావోద్వేగంగా విజ్ఞప్తి చేశారు.
ఈ అంశంపై వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను సైనికుడు కోరారు.
ఇప్పుడు ఈ సెల్ఫీ వీడియో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తారు… సైనికుడికి న్యాయం జరుగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.




