Kurnool: ఫీజుల సాకుతో భోజనం నిలిపివేయడం దుర్మార్గం
Kurnool: రాయలసీమ యూనివర్సిటీలో ఫీజులతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ మెస్ సౌకర్యం కల్పించాలని ఖాళీ ప్లేట్లతో నిరసన.
Kurnool: ఫీజుల సాకుతో భోజనం నిలిపివేయడం దుర్మార్గం
కర్నూలు: రాయలసీమ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ ఫీజుల చెల్లింపుతో సంబంధం లేకుండా తక్షణమే మెస్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని, విద్యార్థులను ఆకలితో ఉంచడం అత్యంత దుర్మార్గమైన చర్య అని విద్యార్థి సంఘాల ఖాళీ ప్లేట్లతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సాయి ఉదయ్, ఏఐఎస్ఎ జిల్లా కార్యదర్శి నాగార్జున, పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు రమణ మాట్లాడుతూ, గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల నుండి వచ్చి ఉన్నత చదువుల కోసం విశ్వవిద్యాలయంపై ఆధారపడిన పేద విద్యార్థులను మెస్ బిల్లుల పేరుతో భోజనానికి దూరం చేయడం అన్యాయమన్నారు. ఆకలితో అలమటించే విద్యార్థులు చదువుపై ఎలా శ్రద్ధ పెట్టగలరని వారు ప్రశ్నించారు.
ఫీజులు కట్టలేదనే సాకుతో విద్యార్థులకు భోజనం నిలిపివేయడం వల్ల వారి విద్యావకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు.ప్రధానంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులకు మెస్ బిల్లులు చెల్లించడానికి విశ్వవిద్యాలయ పరిపాలనా విభాగం తగిన సమయాన్ని (గడువును) ఇవ్వాలి.విద్యార్థులు ఆ గడువులోపు బిల్లులు చెల్లించేంతవరకు, క్యాంపస్లో ఉన్న విద్యార్థులందరికీ నిరంతరాయంగా భోజన సదుపాయాన్ని అందించాలి.
విద్యాసంస్థలు కేవలం నిబంధనలకే పరిమితం కాకుండా, విద్యార్థుల సంక్షేమం మరియు మానవీయ కోణంలో ఆలోచించి ఈ సమస్యను పరిష్కరించాలి. విశ్వవిద్యాలయ అధికారులు తక్షణమే స్పందించి మెస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, లేనిపక్షంలో విద్యార్థుల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.




