Srisailam: శ్రీశైలంలో భక్తుల కోసం సెల్ఫ్ సర్వీస్ కియాస్క్ ప్రారంభం
Srisailam: శ్రీశైలంలో భక్తుల సౌకర్యార్థం సెల్ఫ్ సర్వీస్ కియాస్క్ మిషన్లు ప్రారంభించారు. టికెట్లు, విరాళాలు సులభంగా పొందేలా ఏర్పాట్లు చేశారు.
Srisailam
Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులు ఆధునిక సాంకేతిక సదుపాయాలను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఆలయ పరిధిలో పలుచోట్ల సెల్ఫ్ సర్వీస్ కియాస్క్ మిషన్లను ఏర్పాటు చేశారు.
ఈ కియాస్క్ మిషన్లను శ్రీనివాసరావు, ఆలయ అర్చకులు సంప్రదాయ పూజల అనంతరం ప్రారంభించారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సెల్ఫ్ సర్వీస్ కియాస్క్ల ద్వారా భక్తులు దర్శన టికెట్లు, ప్రసాదాలు, కేశఖండన టికెట్లు సులభంగా పొందవచ్చు. అదనంగా దేవస్థానం వివిధ పథకాలకు విరాళాలను కూడా చెల్లించే సౌకర్యం కల్పించారు. మల్లికార్జున సదన్, గంగా సదన్, కళ్యాణకట్ట, గంగాధర మండపం ప్రాంతాల్లో ఈ మిషన్లు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ కియాస్క్ మిషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు స్వయంగా టికెట్లు పొందేందుకు ఇవి ఉపయోగపడతాయని చెప్పారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన “మనమిత్ర” వాట్సాప్ సేవ ద్వారా 17 రకాల టికెట్లు ముందస్తుగా పొందే అవకాశం ఉందని తెలిపారు. అలాగే దేవస్థానం అధికారిక వెబ్సైట్ మరియు దేవాదాయ శాఖ వెబ్సైట్ ద్వారా కూడా దర్శనం, ఆర్జిత సేవల టికెట్లు బుక్ చేసుకోవచ్చని వివరించారు.
ఈ కియాస్క్ మిషన్లను కరూర్ వైశ్య బ్యాంక్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద దేవస్థానానికి అందజేసినట్లు తెలిపారు.




