Nandikotkour: నందికొట్కూరులో వైఎస్సార్సీపీ భారీ నిరసన ర్యాలీ
Nandikotkour: నంద్యాల జిల్లా నందికొట్కూరులో కూటమి ప్రభుత్వ రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసిస్తూ వైఎస్సార్సీపీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
Nandikotkour: నందికొట్కూరులో వైఎస్సార్సీపీ భారీ నిరసన ర్యాలీ
Nandikotkour: నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డా. సుదీర్, ఇంచార్జి బుడ్డా శేషి రెడ్డిల ఆధ్వర్యంలో "చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమాన్ని నిర్వహించారు.
వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి పటేల్ కూడలి వరకు "చంద్రబాబు డౌన్ డౌన్" అంటూ వందలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పటేల్ కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డా. సుదీర్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సభకు ముందు పటేల్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమం చివరలో చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టో ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా డా. సుదీర్ మాట్లాడుతూ, "ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి వచ్చిన చంద్రబాబు ప్రజలకు ఏమి చేస్తాడు" అని ప్రశ్నించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక నందికొట్కూరులోని ముచ్చుమర్రి గ్రామానికి చెందిన వాసంతి అనే బాలిక ఆచూకీ ఇంతవరకు లేదని, ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, హోం మంత్రి, పవన్, లోకేష్ ఏమి చేస్తున్నారని నిలదీశారు. "ఆ పాప కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. జిల్లా ఎస్పీ, పోలీసులు ఏమి చేస్తున్నారు?" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలోని నీటి సమస్యపై మాట్లాడుతూ, "నందికొట్కూరు చుట్టూ నీరు ఉన్నా మా నియోజకవర్గంలో నీరు లేదు. ఇక్కడ లీడర్లు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసినా నీరు ఎందుకు తీసుకురాలేదు? నందికొట్కూరు ప్రజలంటే అంత చిన్నచూపా?" అని ప్రశ్నించారు.
రెండేళ్ల పాలనలో చంద్రబాబు ఎన్నికల ముందు "సూపర్ సిక్స్" పేరుతో మహిళలు, యువత, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేశారని డా. సుదీర్ ఆరోపించారు.
ఆడబిడ్డ నిధి, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతులకు గిట్టుబాటు ధరలు, మహిళలకు ఆర్థిక భరోసా వంటి కీలక హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో సంక్షేమ పాలనను పక్కనబెట్టి రెడ్బుక్ రాజ్యాంగంతో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలతో కాలం గడుపుతోందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




