Manisha Koirala: ఆహారంతో తన బంధం ఎలా మారిందో చెప్పిన మనీషా కొయిరాలా
Manisha Koirala: ఆహారంపై తన ఆలోచనలు ఎలా మారాయో మనీషా కొయిరాలా వెల్లడించారు. శరీరాన్ని గౌరవిస్తూ దాని అవసరాలను అర్థం చేసుకోవడం నేర్చుకున్నానన్నారు.
Manisha Koirala: ఆహారంతో తన బంధం ఎలా మారిందో చెప్పిన మనీషా కొయిరాలా
Manisha Koirala: నటి మనీషా కొయిరాలా తన ఆహారపు అలవాట్లు, శరీరంతో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కొన్నేళ్లుగా ఆహారం విషయంలో తన ఆలోచనా విధానం పూర్తిగా మారిందని ఆమె తెలిపారు. తాజాగా ఇన్స్టాగ్రామ్లో భోజనం చేస్తున్న ఫొటోను షేర్ చేసిన మనీషా.. ఈ సందర్భంగా తన అనుభవాలను వివరించారు.
గతంలో ఆహారాన్ని నియంత్రణలు, అపరాధ భావనతో చూసేదానినని, ఇప్పుడు మాత్రం తన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం, ఆహారాన్ని ఆస్వాదించడం, శరీరం చెప్పే సంకేతాలను గమనించడం నేర్చుకున్నానని ఆమె చెప్పారు. తన శరీరంతో పోరాడాలని ఇకపై అనుకోవడం లేదని, దానిని జాగ్రత్తగా చూసుకుంటూ గౌరవంగా, సౌకర్యంగా జీవించాలని కోరుకుంటున్నానని మనీషా పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల మనీషా కొయిరాలా తన పుట్టినరోజును కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఆనందంగా జరుపుకున్నారు. ఆమె స్నేహితుడు, సైక్లింగ్ భాగస్వామి సరోష్ ప్రధాన్ ఇన్స్టాగ్రామ్లో పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి మనీషా ఆనందంగా గడిపిన క్షణాలు అందులో కనిపించాయి.
సరోష్ ప్రధాన్తో కలిసి మనీషా తరచూ సైక్లింగ్ చేస్తుంటారు. రద్దీగా ఉండే రోడ్లపై సైకిల్ తొక్కడంపై తనకున్న భయం తగ్గడానికి కూడా సరోష్ కారణమని ఆమె గతంలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
1990 దశకంలో బాలీవుడ్లో అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న మనీషా కొయిరాలా ‘బాంబే’, ‘ఖామోషీ: ది మ్యూజికల్’, ‘దిల్ సే’, ‘గుప్త్’, ‘కంపెనీ’ వంటి చిత్రాల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందారు. 2012లో అండాశయ క్యాన్సర్ బారిన పడిన ఆమె అమెరికాలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఆ అనుభవాలను ‘Healed: How Cancer Gave Me a New Life’ అనే ఆత్మకథలో పొందుపరిచారు.
చికిత్స అనంతరం తిరిగి సినిమాల్లోకి వచ్చిన మనీషా.. ‘సంజు’, ‘హీరామండి: ది డైమండ్ బజార్’ వంటి చిత్రాలు, వెబ్ సిరీస్లతో మరోసారి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె తన ఆరోగ్యం, జీవనశైలి గురించి పంచుకుంటున్న విషయాలు కూడా అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.




