కూరగాయలపై కనిపించని విషం.. వండే ముందు తప్పనిసరిగా ఇలా చేయండి.!
కూరగాయలు, పండ్లపై పురుగుమందుల అవశేషాల ముప్పు.. బేకింగ్ సోడాతో శుభ్రం చేసే సరైన విధానం, నిపుణుల సూచనలు తెలుసుకోండి.
Vegetables Pesticide Warning: Safe Cleaning Tips at Home
ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతిరోజూ కూరగాయలు, పండ్లు తినే వారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయంలో పురుగుమందుల వినియోగం పెరగడంతో కూరగాయలు, పండ్లపై విషపూరిత అవశేషాలు మిగిలే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. బయటకు తాజాగా కనిపించే కూరగాయలను సరైన విధంగా శుభ్రం చేయకుండా వాడితే శరీరంలోకి హానికర రసాయనాలు చేరే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.
పోషకాహార నిపుణుల ప్రకారం, తాజా కూరగాయలు కొనడం మాత్రమే సరిపోదు. వాటిని వండే ముందు బేకింగ్ సోడా కలిపిన నీటిలో కొద్దిసేపు నానబెట్టి, అనంతరం స్వచ్ఛమైన నీటితో బాగా కడగడం ద్వారా పురుగుమందుల అవశేషాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.
వ్యవసాయ నిపుణులు రైతులకు కూడా కీలక సూచనలు చేశారు. పురుగుమందులు పిచికారీ చేసిన వెంటనే పంటను కోయకుండా సూచించిన నిరీక్షణ కాలాన్ని తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. అలాగే శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, పసుపు స్టిక్కీ ట్రాప్స్, ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం ద్వారా పురుగుమందుల వినియోగాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు.
ఇంట్లో గృహిణులు కూడా కూరగాయలు, పండ్లను నేరుగా వండకుండా ముందుగా పలుమార్లు నీటితో కడిగి, అనంతరం బేకింగ్ సోడా కలిపిన నీటిలో కొద్దిసేపు నానబెట్టి మళ్లీ శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ధాన్యాలను గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేయడం, వేప ఆకులు ఉపయోగించడం వంటి పద్ధతులు కూడా కీటకాల సమస్యను తగ్గించడంలో ఉపయోగపడతాయని తెలిపారు.
చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆహారాన్ని మరింత సురక్షితంగా మార్చుకోవచ్చని, నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.




