Mrigashira Karthi: మృగశిర కార్తెలో చేపలు ఎందుకు తినాలంటే..! తెలియని విషయాలు ఇవిగో
Mrigashira Karthi: మృగశిర కార్తె ప్రవేశించిన రోజున ఖచ్చితంగా చేపలు తినాలనేది మన తెలుగు వారి ఆనవాయితీ. అసలు ఈ రోజునే చేపలు ఎందుకు తినాలి?
Mrigashira Karthi: తెలుగు రాష్ట్రాల్లో 'మృగశిర కార్తె'కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎండాకాలం ముగిసి, వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో వచ్చే మృగశిర కార్తె రోజున ప్రతి ఇంట్లోనూ మాంసాహారులు తప్పనిసరిగా చేపలు తింటుంటారు. అయితే, కేవలం ఒక సంప్రదాయంగానే కాకుండా దీని వెనుక ముఖ్యమైన ఆరోగ్య కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.
మృగశిర కార్తె ప్రవేశించడంతోనే నైరుతి రుతుపవనాల రాక మొదలవుతుంది. దీనివల్ల వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుంటాయి. అప్పటివరకు విపరీతమైన ఎండల వల్ల వేడెక్కిన వాతావరణం అకస్మాత్తుగా చల్లబడుతుంది. ఈ వాతావరణ మార్పుల వల్ల జలుబు, దగ్గు, ఉబ్బసం, ఆస్తమా లాంటి శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
చేపలు ఎందుకు తినాలంటే?
వాతావరణం చల్లబడినప్పుడు మన శరీరం సులభంగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే గట్టి రోగనిరోధక శక్తి అవసరం. అందుకు చేపలు అద్భుతంగా పనిచేస్తాయి. చేపలలో మన శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ డి, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు ఐరన్, జింక్, అయోడిన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా చేపల్లో లభిస్తాయి.
ఈ పోషకాలన్నీ శరీరంలో రోగనిరోధక శక్తిని అమాంతం పెంచుతాయి. తద్వారా రాబోయే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి మన శరీరం తట్టుకునే శక్తిని పొందుతుంది. అందుకే మన పెద్దలు వాతావరణానికి అనుగుణంగా, మన ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశ్యంతోనే మృగశిర కార్తె నాడు చేపలు తినే ఈ ఆనవాయితీని తీసుకువచ్చారు.




