Kollapur: తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపకల్పనే SIR లక్ష్యం కలెక్టర్ హేమంత్
Kollapur: తప్పుల్లేని ఓటర్ జాబితా రూపకల్పనే ఎస్ఐఆర్ లక్ష్యమని నాగర్ కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ స్పష్టం చేశారు. వెన్నిచర్లలో హియరింగ్ ప్రక్రియ పరిశీలన.
Kollapur: తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపకల్పనే SIR లక్ష్యం కలెక్టర్ హేమంత్
Kollapur: ఓటర్ జాబితాలోని చిన్నచిన్న తప్పులను సరిచేసి, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా స్పష్టమైన, ఖచ్చితమైన ఓటర్ జాబితాను రూపొందించడమే ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని, అందులో భాగంగానే నోటీసుదారులతో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ స్పష్టం చేశారు.
బుధవారం కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలం వెన్నిచర్ల గ్రామంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు జారీ చేసిన ఓటర్లతో బీఎల్వో స్థాయిలో నిర్వహిస్తున్న హియరింగ్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హియరింగ్ నిర్వహిస్తున్న విధానాన్ని స్వయంగా పరిశీలించి, ఒక ఓటర్ వివరాలను యాప్ లో అప్లోడ్ చేసిన జిల్లా కలెక్టర్, ఓటర్ల నుంచి స్వీకరిస్తున్న వివరాలు, ఆధారాలు, అభ్యంతరాలపై సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
గ్రామ పరిధిలో మూడు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న మొత్తం 3010 మంది ఓటర్ల ఉండగా కేవలం 43 మంది ఓటర్లకు చిన్నచిన్న తప్పులను సరి చేసేందుకు నేటి నిర్వహించిన గ్రామ సభకు 43 మంది ఓటర్లు హాజరైనట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మాట్లాడుతూ, ఓటర్ జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యమైన పత్రం అని అన్నారు. జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండటంతో పాటు, నమోదైన ఓటర్ల వివరాలు కూడా ఖచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా గుర్తించిన అంశాలపై సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేసి, వారి నుంచి వివరణలు, అవసరమైన ఆధారాలను స్వీకరిస్తున్నామని తెలిపారు.
నోటీసులు అందుకున్న ప్రతి ఓటరికి తన వాదనను వినిపించే అవకాశం కల్పించాలని, వారు సమర్పించే ఆధారాలను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరు కూడా అనవసరంగా జాబితా నుంచి తొలగిపోకూడదు. అదే సమయంలో అనర్హమైన లేదా తప్పుగా నమోదైన వివరాలు కూడా కొనసాగకుండా చూడాలి” అని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటర్ జాబితాలోని ప్రతి నమోదును నిబంధనల మేరకు పరిశీలించి, అవసరమైన సవరణలను ఆధారాల ఆధారంగా మాత్రమే చేపట్టాలని సూచించారు.
ఓటర్ల పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే సంబంధిత ఆధారాలతో వాటిని సరిచేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. గ్రామస్థాయిలో నిర్వహిస్తున్న హియరింగ్ కార్యక్రమాల ఉద్దేశాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించి, ఎలాంటి అపోహలకు తావులేకుండా ప్రక్రియను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.
హియరింగ్కు హాజరయ్యే ప్రతి ఓటరును బాధ్యతాయుతంగా విచారించి, వారు సమర్పించే పత్రాలను పరిశీలించాలని బీఎల్వోలకు సూచించారు. హియరింగ్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత, నిష్పక్షపాత వైఖరి, నిబంధనల అమలు ప్రధానంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి ఒత్తిళ్లు, పక్షపాతాలకు అవకాశం లేకుండా ప్రతి అభ్యర్థనను సమాన దృష్టితో పరిశీలించాలని ఆదేశించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, ప్రతి ఓటరు తమ ఓటర్ వివరాలను పరిశీలించుకోవాలని, గ్రామంలో మూడు పోలింగ్ కేంద్రాల పరిధిలో అందజేసిన నోటీసులు తక్కువగానే ఉన్నాయని , ఒకేరోజు నిర్వహిస్తున్న గ్రామ సభ ద్వారా ఏవైనా పొరపాట్లు లేదా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఓటర్ జాబితా సవరణకు సంబంధించి ప్రజలకు అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వాన్ని బీఎల్వోలు అందించాలని తెలిపారు.
గ్రామస్థాయిలో నిర్వహిస్తున్న హియరింగ్ కార్యక్రమాల ద్వారా ఓటర్ల సమస్యలను పరిష్కరించడంతో పాటు, తుది ఓటర్ జాబితా మరింత స్పష్టంగా, ఖచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్ జాబితాకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి అధికారి, బీఎల్వో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
వెన్నిచర్లలో నిర్వహించిన హియరింగ్ ప్రక్రియను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని నిర్ణీత నిబంధనల ప్రకారం పూర్తి చేసి, ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ఓటర్ జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు.
గ్రామంలో మంచి చెరువు ఉందని, గ్రామంలోని ప్రజలు మంచి పంటలు పండించి జీవనోపాధి లక్ష్యంగా రాణించాలన్నారు. గ్రామానికి అవసరమైన మీసేవ కేంద్రాన్ని మంజూరు చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్, తాహసిల్దార్ శ్రీనివాసులు, గ్రామ సర్పంచ్ , బి ఎల్ వోలు సంబంధిత ఎన్నికల అధికారులు, బీఎల్వోలు, ఎన్నికల సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.




