Gadwal: పంటలకు తెగుళ్ల నివారణపై శాస్త్రవేత్తల క్షేత్రస్థాయి పరిశీలన
Gadwal: వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో రైతుల పంటలను పరిశీలించిన తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డా. ఆర్చన. తెగుళ్ల నివారణకు సూచనలు.
Gadwal: పంటలకు తెగుళ్ల నివారణపై శాస్త్రవేత్తల క్షేత్రస్థాయి పరిశీలన
గద్వాల్: వ్యవసాయ శాఖ అధికారులు, నిపుణుల సలహాలను పాటించి రైతులు తమ పంటలకు తెగుళ్లు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జిల్లా సమన్వయకర్త డా.ఆర్చన అన్నారు.
శనివారం వడ్దేపల్లి, రాజోలి మండలాల్లోనీ వివిధ గ్రామాల పరిధిలో ఉన్న రైతుల పంటలపై శాస్త్రవేత్తలు నిర్ధారణాత్మక క్షేత్ర సందర్శన చేపట్టారు. మొక్కజొన్న, వరి, సాధారణ పత్తి, హెచ్డీపీఎస్ పత్తి, మిరప, కంది, చెరకు, తదితర పంటలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల రోజుల వయస్సు గల పత్తి పంటలో తగినంత తేమ, పోషక యాజమాన్యం పాటించాలని, కలుపు నివారణ చేపట్టాలని సూచించారు.15 రోజుల నాట్ల దశలో ఉన్న మిరపలో తగినంత తేమ ఉండేలా చూసుకోవడంతో పాటు నీరు నిల్వ ఉండకుండా మంచి నీటి పారుదల కల్పించాలని సూచించారు.
ఎదుగుదల దశలో ఉన్న కంది పంటను కలుపు లేకుండా ఉంచాలని, సరైన నీటి పారుదల కల్పించాలని సూచించారు. పక్వత ప్రారంభ దశలో ఉన్న చెరకు పంటలో తగినంత తేమను కొనసాగిస్తూ నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. ఎర్రకుళ్లు సోకిన మొక్కలను తొలగించి నాశనం చేయాలని సూచించారు.




