Mancherial: కొండా సురేఖను మంత్రివర్గంలోకి తీసుకోవాలి: బీసీ ఐక్య వేదిక డిమాండ్
Mancherial: రేవంత్ సర్కార్లో బీసీలను రాజకీయంగా అణగదొక్కే కుట్రలు జరుగుతున్నాయని మంచిర్యాలలో బీసీ సంఘాల ఐక్య వేదిక నేతలు ఆరోపించారు.
Mancherial: కొండా సురేఖను మంత్రివర్గంలోకి తీసుకోవాలి: బీసీ ఐక్య వేదిక డిమాండ్
మంచిర్యాల: ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు కుట్రలు జరుగుతున్నాయని బీసీ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర నాయకులు అంబిలపు శ్రీనివాస్, గాదె సత్యం ఆరోపించారు. మంచిర్యాల పట్టణంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాలకు తీరని అన్యాయం చేస్తోందని వారు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో పలువురు నాయకులు పార్టీ లైన్ దాటి మాట్లాడినా వారిపై చర్యలు తీసుకోలేదని, కేవలం కొండా సురేఖ విషయంలోనే కక్షపూరితంగా వ్యవహరించడం ఎందుకని ప్రశ్నించారు.
కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చేసిన రాజకీయ వ్యాఖ్యలకు తల్లిని బాధ్యురాలిని చేస్తూ క్రమశిక్షణా చర్యల పేరుతో సురేఖను పదవి నుంచి తొలగించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. కొండా సురేఖను వెంటనే రేవంత్రెడ్డి మంత్రివర్గంలోకి తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నరెడ్ల శ్రీనివాస్, మైనార్టీ సంఘం నాయకులు ఎండీ సత్తార్, పద్మశాలి సంఘం నాయకులు అంకం నరేష్, మున్నూరు కాపు సంఘం నాయకులు తోట తిరుపతి, రాజు పటేల్, పెరక సంఘం నాయకులు గొల్ల రాజలింగు, రజక సంఘం నాయకులు లింగమూర్తి, గౌడ్ సంఘం నాయకులు బాలు గౌడ్, కుమ్మరి సంఘం నాయకులు రమేష్, మున్నూరు కాపు సంఘం నాయకులు మొగిలి సత్యం, తిరుపతి, ఎడ్ల కిషన్, ఎగ్గన మల్లేష్, ఓడ్నాల రవీందర్, మల్క భూమయ్య, చంద్ర మోహన్, వినుకొండ రవి, డీ. లచ్చయ్య, సీపతి రవి, సామల నరేష్, హరీష్, సంతోష్, ఎండీ వహిద్, బోలిశెట్టి అంజన్న, కంచెర్ల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.




