Kagaznagar: ఓటరు నమోదులో పారదర్శకత ఉండాలి ఎమ్మెల్సీ దండే విఠల్
Kagaznagar: కాగజ్నగర్లో SIR-2026 ఓటరు నమోదుపై ఎమ్మెల్సీ దండే విఠల్, ఆర్డీఓ కృష్ణయ్య సమీక్ష. ఓటర్ జాబితా సవరణల్లో పొరపాట్లకు తావుండొద్దని ఆదేశం.
Kagaznagar: ఓటరు నమోదులో పారదర్శకత ఉండాలి ఎమ్మెల్సీ దండే విఠల్
కాగజ్నగర్: కాగజ్నగర్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన SIR-2026 ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియ సమీక్ష సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సి.హెచ్. కృష్ణయ్యతో కలిసి ఓటరు నమోదు, సవరణ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, అందువల్ల ప్రతి దరఖాస్తును నిబంధనలకు అనుగుణంగా క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి పారదర్శకతతో నమోదు ప్రక్రియను నిర్వహించాలని అధికారులను సూచించారు.
మరణించిన వారి ఓట్ల తొలగింపు, డబుల్ ఓట్ల గుర్తింపు, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల (షిఫ్టింగ్) వివరాల సవరణ వంటి ప్రక్రియలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంటూ, ప్రతి బీఎల్ఓ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.
ఆర్డీఓ సి.హెచ్. కృష్ణయ్య మాట్లాడుతూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతి దరఖాస్తును నిష్పక్షపాతంగా పరిశీలించి, నిర్ణీత గడువులోపు నమోదు, సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.




