Asifabad: వ్యక్తిగత స్వార్థంతో పార్టీకి నష్టం చేయకండి: ఆత్రం సుగుణ హెచ్చరిక

Asifabad: హైదరాబాద్ గాంధీభవన్ ఎదుట నిర్వహించిన "డీసీసీ హటావో.. కాంగ్రెస్ బచావో" నిరసనను కొమురం భీం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ తీవ్రంగా ఖండించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 6 Aug 2026 11:55 PM IST
Asifabad
X

Asifabad: వ్యక్తిగత స్వార్థంతో పార్టీకి నష్టం చేయకండి: ఆత్రం సుగుణ హెచ్చరిక

ఆసిఫాబాద్: కొమురం భీం జిల్లా కాంగ్రెస్ కమిటీలో నెలకొన్న అంతర్గత విభేదాల నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ స్పందించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్ వద్ద "డీసీసీ హటావో.. కాంగ్రెస్ బచావో" పేరుతో కొందరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆసిఫాబాద్‌లోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆత్రం సుగుణ మాట్లాడుతూ, కొందరు వ్యక్తిగత ప్రయోజనాలు, పదవుల ఆశతో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ చరిత్ర ఉందని, క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే పార్టీగా గుర్తింపు పొందిందన్నారు. పార్టీపై ఏవైనా అభ్యంతరాలు లేదా అసంతృప్తులు ఉంటే వాటిని పార్టీ అంతర్గత వేదికల్లో చర్చించి పరిష్కరించుకోవాలని, గాంధీభవన్ వంటి పార్టీ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టడం వల్ల పార్టీ కార్యకర్తల్లో, ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు.

జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టిగా పనిచేస్తున్నారని, అలాంటి సమయంలో కొందరు కావాలనే పార్టీని బలహీనపరిచే ప్రయత్నాలు చేయడం బాధాకరమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనే తమ దృష్టి ఉందని చెప్పారు.

పార్టీ అధిష్ఠానం ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోందని, పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై తప్పకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వ్యక్తిగత విభేదాలను పార్టీకి ఆపాదించడం సరికాదని, కాంగ్రెస్ కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని, అలాంటి సమయంలో అంతర్గత విభేదాలతో పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలు ఎవరూ చేయకూడదన్నారు. జిల్లా కాంగ్రెస్‌లో ఎలాంటి విభేదాలు లేవని, కొందరు వ్యక్తుల చర్యలతో మొత్తం పార్టీని అంచనా వేయడం సరికాదని పేర్కొన్నారు.

ఈ మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణకు మద్దతు ప్రకటించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.

Next Story