Mancherial: ఆర్టీసీ ఈ-ఆటోల నిర్ణయంపై భగ్గుమన్న మంచిర్యాల ఆటో డ్రైవర్లు!
Mancherial: ఆర్టీసీ ఈ-ఆటోల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని మరియు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్లు భారీ ఆందోళన చేపట్టారు.
Mancherial: ఆర్టీసీ ఈ-ఆటోల నిర్ణయంపై భగ్గుమన్న మంచిర్యాల ఆటో డ్రైవర్లు!
మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆటో యూనియన్లు ఆందోళనకు దిగాయి. ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో నిరసన చేపట్టారు. ఆర్టీసీ యాజమాన్యం ఈ-ఆటోలు ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ-ఆటోలు అందుబాటులోకి వస్తే ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్ల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రతి డ్రైవర్కు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని కోరారు. పెరుగుతున్న ఇంధన ధరలు, వాహనాల నిర్వహణ ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. ఐకాసా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినట్లు యూనియన్ నాయకులు తెలిపారు.
ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమవుతుందని, తమ సమస్యలకు పరిష్కారం లభించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న నిరవధిక సమ్మెకు ప్రజలు, ఆటో డ్రైవర్లు సహకరించాలని యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు.




