Mancherial: మంచిర్యాలలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభం!

Mancherial: మంచిర్యాలలో ఆగస్టు 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభం. 3 జిల్లాల్లోని 49,104 మంది విద్యార్థులకు ప్రతిరోజూ పోషకాహార అల్పాహారం లభించనుంది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 29 Aug 2026 11:18 PM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాలలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభం!

Mancherial: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల అగ్రికల్చర్ మార్కెట్ యార్డులోని మెడికల్ గోడౌన్‌లో నిర్మించిన అధునాతన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ను ఆగస్టు 31న ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఈ కిచెన్ ద్వారా మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని 17 మండలాల పరిధిలో 691 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 42,450 మంది విద్యార్థులకు, అలాగే 13 జూనియర్ కళాశాలల్లోని 6,654 మంది విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించనున్నారు. మొత్తంగా 49,104 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

అత్యాధునిక సదుపాయాలతో కిచెన్

ప్రభుత్వం కేటాయించిన 8,000 చదరపు అడుగుల షెడ్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కిచెన్‌ను ఏర్పాటు చేశారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించేందుకు ఫుడ్ ల్యాబ్, మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్, RO వాటర్ ప్లాంట్, బాయిలర్ ప్లాంట్, సెంట్రల్ గ్యాస్ బ్యాంక్, ఆటోమేటెడ్ వెజిటబుల్ వాషింగ్ అండ్ కటింగ్ యూనిట్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు.

ఆటోమేటెడ్ యంత్రాల ద్వారా గంటకు 5,600 ఇడ్లీలు, 2,000 దోశలు, 3,600 పూరీలు తయారు చేసే సామర్థ్యం ఉంది. సాంబార్, కూరల తయారీ యూనిట్ల ద్వారా రెండు గంటల్లో 5,000 మంది విద్యార్థులకు సరిపడా ఆహారాన్ని, రైస్ కుకింగ్ పరికరాల ద్వారా కేవలం 40 నిమిషాల్లో 1,000 మందికి సరిపడా అన్నాన్ని సిద్ధం చేయవచ్చు. మొత్తంగా ఈ కిచెన్‌లో రోజుకు 50 వేల మందికి ఆహారం అందించగల సామర్థ్యం ఉంది.

పోషకాహారంతో కూడిన మెనూ

విద్యార్థులకు సమతుల్యమైన ఆహారం అందించేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సూచనల మేరకు అల్పాహార మెనూను రూపొందించారు.

సోమవారం: ఇడ్లీ – సాంబార్

మంగళవారం: పూరీ – ఆలూ కుర్మా

బుధవారం: దోశ – చట్నీ

గురువారం: ఉప్మా – చట్నీ

శుక్రవారం: మిల్లెట్ ఇడ్లీ – సాంబార్

శనివారం: బోండా – చట్నీ

మూడు జిల్లాల్లోని విద్యార్థులకు ప్రయోజనం

ఈ కిచెన్ పరిధిలో మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, జన్నారం, మందమర్రి, లక్సెట్టిపేట, దండేపల్లి, కాజీపేట, నెన్నాల్, హాజీపూర్, నాస్పూర్, భీమారం, జగిత్యాల జిల్లాలోని వెల్లటూరు, ఎండపల్లి, పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, అంతర్గాం, పాలకుర్తి మండలాలు ఉన్నాయి.

ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు ఉదయం పూట ఆకలితో పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు వెళ్లకుండా పోషకాహారంతో కూడిన అల్పాహారం తీసుకుని ఆరోగ్యంగా, ఉత్సాహంగా విద్యాభ్యాసం చేసేలా రూపొందించారు.

HKMCF అమలు భాగస్వామ్యం

ఈ కిచెన్ నిర్వహణలో హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ (HKMCF) అమలు భాగస్వామిగా వ్యవహరిస్తోంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) తన CSR నిధుల ద్వారా కిచెన్ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించింది.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో హిస్ గ్రేస్ శ్రీ సత్య గౌర చంద్ర దాస స్వామీజీ, ప్రెసిడెంట్, HKMCF, అలాగే ది అక్షయ పాత్ర ఫౌండేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రీజినల్ ప్రెసిడెంట్‌తో పాటు HKMCF ప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు.

విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యాభ్యాసాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ మూడు జిల్లాల వేలాది మంది విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన అల్పాహారం అందించనుంది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.

Next Story