Nennela: నెన్నెలలో రూ.1.70 కోట్లతో బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
Nennela: నెన్నెల మండలం జోగాపూర్ - మైలారం వాగు బ్రిడ్జి వరకు రూ.1.70 కోట్లతో బీటీ రోడ్డు పనులను ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్.
Nennela: నెన్నెలలో రూ.1.70 కోట్లతో బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
నెన్నెల: బెల్లంపల్లి నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి మరో అడుగు పడింది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని జోగాపూర్ టీ రోడ్డు నుంచి మైలారం మత్తడి వాగు బ్రిడ్జి వరకు రూ.1.70 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
నెన్నెల మండలంలోని జోగాపూర్ టీ రోడ్డు నుంచి మైలారం మత్తడి వాగు బ్రిడ్జి వరకు రూ.1.70 కోట్ల నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల సమయంలో మైలారం, గోల్లపల్లి గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడమే తన లక్ష్యమని చెప్పారు.
ఈ రహదారి నిర్మాణం పూర్తయితే మైలారం, గోల్లపల్లి గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
తమకు ఇచ్చిన హామీని నెరవేర్చి బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మైలారం, గోల్లపల్లి గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.




