Asifabad: చీలపల్లిలో ఎమ్మెల్సీ దండే విఠల్‌ను అడ్డుకున్న గ్రామస్తులు

Asifabad: కొమురం భీం జిల్లా సిర్పూర్-టి మండలం చీలపల్లి వద్ద కల్వర్టు నిర్మాణానికి శాశ్వత నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ దండే విఠల్‌ను గ్రామస్తులు అడ్డుకున్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 19 Sept 2026 2:41 PM IST
Asifabad
X

Asifabad: చీలపల్లిలో ఎమ్మెల్సీ దండే విఠల్‌ను అడ్డుకున్న గ్రామస్తులు

కొమురం భీం జిల్లా: సిర్పూర్‌-టి మండలం చీలపల్లి గ్రామ సమీపంలో ఎమ్మెల్సీ దండే విఠల్‌ను గ్రామస్తులు అడ్డుకున్నారు. సిర్పూర్‌-టి నుంచి చీలపల్లి, మాలిని, మేడిపల్లి, రావణిపెల్లి తదితర గిరిజన గ్రామాలకు వెళ్లే మార్గంలో ఉన్న కల్వర్టు నిర్మాణానికి రూ.10 లక్షల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్సీ తెలిపారు.

అయితే ఈ నిధులు సరిపోవని గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో రూ.5 లక్షలతో చేపట్టిన కల్వర్టు పనులు చిన్నపాటి వర్షానికే కొట్టుకుపోయాయని వారు ఆరోపించారు. తాత్కాలిక మరమ్మతులు కాకుండా.. శాశ్వతంగా సమస్య పరిష్కారమయ్యేలా బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికే రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించినట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి అధిక్‌ తెలిపారని గ్రామస్తులు పేర్కొన్నారు. మరిన్ని నిధులు మంజూరు చేసి శాశ్వత బ్రిడ్జి నిర్మాణానికి సహకరించాలని ఎమ్మెల్సీని కోరారు.

ఎన్నో ఏళ్లుగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత బ్రిడ్జి నిర్మాణం చేపట్టకుండా చిన్నపాటి నిధులతో తాత్కాలిక పనులు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఆయా గ్రామాలకు వెళ్లకుండా గ్రామస్తులు రోడ్డుకు అడ్డంగా నిలిచారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామస్తులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఎమ్మెల్సీ దండే విఠల్ మోటార్‌సైకిల్‌పై చీలపల్లి గ్రామానికి బయలుదేరి వెళ్లారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.