Medak: ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ మద్దతు.. పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్
Medak: మెదక్లో ఆర్టీసీ కార్మికుల ధర్నాకు బీఆర్ఎస్ మద్దతు. హామీలు అమలు చేయాలని పద్మా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Medak
Medak: మెదక్ పట్టణంలో ఆర్టీసీ కార్మికుల ధర్నాకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి గురువారం గుల్షన్ క్లబ్ ఆవరణలో నిర్వహించిన ధర్నాలో పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం చూపుతున్నారని ఆమె ఆరోపించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న కార్మికులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి ఇతర ప్రాంతాలకు తరలించడం సరైంది కాదని పేర్కొన్నారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని గుర్తుచేసిన ఆమె, వారి సమస్యలు పరిష్కరించే వరకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, పట్టణ కన్వీనర్ ఆంజనేయులు, కౌన్సిలర్లు దీపక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




