Medak: నర్సాపూర్ ఆత్మహత్య ప్రేరేపణ కేసులో రిపోర్టర్ అరెస్ట్

Medak: PACS ఆపరేటర్ హర్షద్ ఆత్మహత్య కేసులో టీవీ రిపోర్టర్ ఒబులసి లింగం గౌడ్ అరెస్ట్. నిందితుడికి రిమాండ్ విధించిన కోర్టు. కౌడిపల్లి ఎస్సై వివరాల వెల్లడి.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 19 July 2026 5:28 PM IST
Medak
X

Medak: నర్సాపూర్ ఆత్మహత్య ప్రేరేపణ కేసులో రిపోర్టర్ అరెస్ట్

మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం లోని కౌడిపల్లి మండలంలోని మహమ్మద్‌నగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS)లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన షేక్ హర్షద్ ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు.

ఈ కేసులో ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న చరణ్ టీవీ రిపోర్టర్ & CEO ఒబులసి లింగం గౌడ్‌ను శనివారం అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు కౌడిపల్లి ఎస్సై అమరేందర్ రెడ్డి వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్‌నగర్ PACS సెంటర్‌లో ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ యూట్యూబ్ వేదికగా ఆరోపణలు చేయడంతో పాటు, కంప్యూటర్ ఆపరేటర్ షేక్ హర్షద్‌ను పదేపదే బెదిరింపులకు గురిచేసినట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వేధింపులు, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక హర్షద్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి, సాక్ష్యాధారాలను సేకరించారు. దర్యాప్తులో భాగంగా షేక్ హర్షద్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ఒబులసి లింగం గౌడ్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, అవసరమైతే మరిన్ని కోణాల్లో విచారణ చేపడతామని ఎస్సై అమరేందర్ రెడ్డి తెలిపారు.

ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సామాజిక మాధ్యమాల వేదికగా చేసే ఆరోపణలు, వాటి ప్రభావం, వ్యక్తులపై పడే మానసిక ఒత్తిడి వంటి అంశాలు మరోసారి చర్చకు వచ్చాయి. అయితే కేసులోని ఆరోపణలపై తుది నిజానిజాలు న్యాయపరమైన విచారణలో తేలనున్నాయి.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story