Narsapur: కూరగాయల సంతలో మొబైల్ ఫోన్ల చోరీ – మైనర్ బాలుడు పట్టివేత

Narsapur: నర్సాపూర్ సంతలో వినాయక చవితి రద్దీని ఆసరాగా చేసుకుని మొబైల్స్ చోరీ. ఒక బాలుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన ప్రజలు. మిగిలిన ఫోన్ల కోసం దర్యాప్తు.

G Ashok Reddy, Narsapur
Published on: 11 Sept 2026 9:04 PM IST
Narsapur
X

Narsapur: కూరగాయల సంతలో మొబైల్ ఫోన్ల చోరీ – మైనర్ బాలుడు పట్టివేత

నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన కూరగాయల సంతలో మొబైల్ ఫోన్ల చోరీ కలకలం రేపింది. వినాయక చవితి పండుగకు మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో నర్సాపూర్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా ప్రజలు సంతకు తరలివచ్చారు. ఈ రద్దీని ఆసరాగా చేసుకుని కొందరు దొంగలు మొబైల్ ఫోన్ల చోరీలకు పాల్పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంతలో మొత్తం ఐదు మొబైల్ ఫోన్లు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. అయితే చోరీకి గురైన ఫోన్లలో నారాయణపూర్ గ్రామానికి చెందిన ఎగొండ మొబైల్ ఫోన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మరో నాలుగు మొబైల్ ఫోన్లు ఇంకా లభించాల్సి ఉంది.

చోరీ చేస్తుండగా మైనర్ బాలుడు పట్టుకొన్న స్థానికులు

మొబైల్ చోరీకి పాల్పడుతున్న ఓ మైనర్ బాలుడిని స్థానికులు గమనించి పట్టుకున్నారు. అతడిని అక్కడికక్కడే నిలదీసి అనంతరం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా చోరీ ఘటనపై మరిన్ని వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మిగిలిన నాలుగు మొబైల్ ఫోన్ల ఆచూకీ కోసం దర్యాప్తు కొనసాగాల్సి ఉంది.

సంతలో రద్దీని ఆసరాగా చేసుకుంటున్నారా?

నర్సాపూర్‌లో ప్రతి మంగళవారం, శుక్రవారం కూరగాయల సంత జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు సంతకు వస్తుంటారు. ప్రస్తుతం వినాయక చవితి పండుగ నేపథ్యంలో కొనుగోళ్ల కోసం మరింత ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది.

ఈ రద్దీని ముందుగానే గమనించిన దొంగలు మొబైల్ ఫోన్లను టార్గెట్ చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ సంత రోజుల్లో ఇలాంటి చోరీలు జరిగినట్లు బాధితులు చెబుతున్నారు.

పోలీసుల నిఘా పెంచాలని ప్రజల డిమాండ్

రాబోయే సంతల్లో మరింత భారీగా ప్రజలు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. సంత ప్రాంతంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ పెంచడంతో పాటు రద్దీ ప్రాంతాల్లో పోలీసు సిబ్బందిని మోహరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇప్పటికే ఒక మొబైల్ లభించగా.. మరో నాలుగు ఫోన్ల ఆచూకీ కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు. మిగిలిన ఫోన్లను కూడా గుర్తించి బాధితులకు అప్పగించడంతో పాటు, సంతల్లో వరుస చోరీలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur