Narsapur: నర్సాపూర్లో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం!
Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్లో అరుదైన దృశ్యం. తల్లి చనిపోయి ఆకలితో అలమటిస్తున్న కుక్క పిల్లలను అక్కున చేర్చుకుని పాలిస్తూ మాతృత్వాన్ని చాటుకున్న వరాహం.
Narsapur: నర్సాపూర్లో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం!
Narsapur: సాధారణంగా కుక్కలు, పందులు ఒకదానికొకటి దూరంగా ఉండే జంతువులు. కుక్కలు పందులపై దాడి చేయడం. వాటిని చూసి పందులు పరుగులు తీయడం మనం తరచూ చూస్తుంటాం. కానీ నర్సాపూర్లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన ఘటన చోటుచేసుకుంది.
నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు మన్నెవారి వీధిలో ఓ వరాహం కుక్క పిల్లలకు తల్లిగా మారింది. కుక్క పిల్లలకు జన్మనిచ్చిన తల్లి కుక్క కొన్ని రోజుల క్రితం మృతి చెందడంతో.. తల్లి లేని ఆ కుక్క పిల్లలు ఆకలితో అలమటిస్తున్నాయి.
ఈ పరిస్థితిని చూసిన ఓ వరాహం.. ఆ కుక్క పిల్లలను అక్కున చేర్చుకుని, వాటికి తన పాలు ఇస్తూ మాతృత్వాన్ని చాటుతోంది. గత నాలుగు రోజులుగా వరాహం కుక్క పిల్లలకు క్రమం తప్పకుండా పాలు ఇస్తున్నట్లు స్థానికుడు సుధీర్ కుమార్ గౌడ్ తెలిపారు.
సాధారణంగా జంతువుల మధ్య కనిపించే సహజ విరోధానికి భిన్నంగా.. ఈ వరాహం కుక్క పిల్లలను తన పిల్లలుగా భావించి ఆదుకోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ అరుదైన దృశ్యాన్ని చూసిన కాలనీవాసులు.. జంతువుల్లోనూ ప్రేమ, ఆప్యాయత, మాతృత్వానికి జాతి భేదాలు అడ్డుకావని ఈ ఘటన మరోసారి నిరూపించిందని అంటున్నారు.
తల్లి కోల్పోయిన కుక్క పిల్లలకు.. మరో జాతికి చెందిన వరాహం తల్లిగా మారిన ఈ ఘటన ప్రస్తుతం నర్సాపూర్లో చర్చనీయాంశంగా మారింది.




