Ashu Reddy: హైకోర్టు మెట్లెక్కిన అషురెడ్డి.. మోసం కేసుపై క్వాష్ పిటిషన్ దాఖలు!
Ashu Reddy: లండన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను మోసం చేశారనే ఆరోపణలపై నమోదైన కేసును రద్దు చేయాలని అషురెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై వచ్చిన రూ. 9.35 కోట్ల మోసం ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు.
Ashu Reddy: హైకోర్టు మెట్లెక్కిన అషురెడ్డి.. మోసం కేసుపై క్వాష్ పిటిషన్ దాఖలు!
Ashu Reddy: తనపై నమోదైన భారీ ఆర్థిక మోసం కేసును కొట్టివేయాలని కోరుతూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అషురెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. లండన్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పెళ్లి పేరుతో నమ్మించి రూ. 9.35 కోట్లు కాజేశారని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS)లో నమోదైన ఎఫ్.ఐ.ఆర్ (FIR)ను రద్దు చేయాలని ఆమె తన క్వాష్ పిటిషన్లో కోరారు.
అషురెడ్డి తన పిటిషన్లో పోలీసుల విచారణ తీరుపై పలు కీలక ఆరోపణలు చేశారు. కనీసం తన వివరణ తీసుకోకుండానే పోలీసులు ఏకపక్షంగా కేసు నమోదు చేశారని ఆమె పేర్కొన్నారు. కావాలనే తన పరువు దెబ్బతీయడానికి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ఆమె వాదిస్తున్నారు. ఈ కేసు విచారణపై తక్షణమే స్టే విధించాలని, పోలీసుల తదుపరి చర్యలను అడ్డుకోవాలని ఆమె కోర్టును అభ్యర్థించారు.
లండన్లో ఉండే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు పెళ్లి పేరుతో ఎర వేసి, విడతల వారీగా సుమారు రూ. 9.35 కోట్లు వసూలు చేశారనే ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. ఈ లావాదేవీలకు సంబంధించి పోలీసులు ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్వాష్ పిటిషన్ త్వరలోనే హైకోర్టులో విచారణకు రానుంది. హైకోర్టు ఇచ్చే తీర్పు అషురెడ్డి భవిష్యత్తును నిర్ణయించనుంది.




