Dragon Movie: అక్టోబర్లో 'డ్రాగన్' సెట్స్లోకి ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ భారీ ప్లానింగ్!
Dragon Movie: భుజానికి గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న ఎన్టీఆర్ అక్టోబర్లో 'డ్రాగన్' షూటింగ్లో పాల్గొననున్నారు.
Dragon Movie: అక్టోబర్లో 'డ్రాగన్' సెట్స్లోకి ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ భారీ ప్లానింగ్!
Dragon Movie: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'డ్రాగన్' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో నటుడు ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో చిత్ర పనులకు కొంతమేర విరామం వచ్చింది. ఆ తర్వాత ఆయన ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేయించుకుని వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో తారక్ తిరిగి సెట్స్లోకి అడుగుపెట్టే సమయం ఖరారైంది.
తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ అక్టోబర్ మొదటి వారం నుంచి 'డ్రాగన్' రెగ్యులర్ షూటింగ్లో పాల్గొననున్నారు. హీరో అందుబాటులో లేని సమయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇతర ముఖ్యమైన సన్నివేశాలను పూర్తి చేశారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి దాదాపు డెబ్బై శాతం షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పుడు తారక్ మళ్లీ సెట్స్కి వస్తుండటంతో మిగిలిన భాగాన్ని ఏకధాటిగా పూర్తి చేసేందుకు మేకర్స్ భారీ షెడ్యూల్ను సిద్ధం చేశారు. అక్టోబర్లో ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు నిరంతరం కొనసాగనుంది.
ఈ సుదీర్ఘ షెడ్యూల్లోనే 'డ్రాగన్' పార్ట్ 2కు సంబంధించిన కొన్ని కీలకమైన సీక్వెన్స్లను కూడా ఏకకాలంలో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ఓపియం, హెరాయిన్ వాణిజ్యంపై ఆధిపత్యం కోసం జరిగే భీకరమైన యుద్ధం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని సమాచారం. ఈ చిత్ర నిర్మాణానికి మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ను కేటాయించాయి. సినిమా నిర్మాణ వ్యయం సుమారు రూ. 300 కోట్ల వరకు ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. ప్రశాంత్ నీల్ టేకింగ్, రవి బస్రూర్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, బిజూ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.




