Duvvada Madhuri: దువ్వాడ మాధురి ప్రత్యేక ఆకర్షణగా 'చీన్ టపాక్ డుం డుం'
Duvvada Madhuri: ప్రస్తుతం ఇంటర్నెట్ను ఊపేస్తున్న వైరల్ డైలాగ్ 'చీన్ టపాక్ డుం డుం' ఇప్పుడు వెండితెరపై నవ్వుల పువ్వులు పూయించడానికి సిద్ధమైంది.
Duvvada Madhuri
Duvvada Madhuri: ప్రస్తుతం ఇంటర్నెట్ను ఊపేస్తున్న వైరల్ డైలాగ్ 'చీన్ టపాక్ డుం డుం' ఇప్పుడు వెండితెరపై నవ్వుల పువ్వులు పూయించడానికి సిద్ధమైంది. గవిరెడ్డి శ్రీనివాస్ కథానాయకుడిగా, బ్రిగిడా సాగా కథానాయికగా నటిస్తున్న ఈ సరికొత్త కామెడీ ఎంటర్టైనర్ ఇటీవల హైదరాబాద్లో సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ముఖ్యంగా సోషల్ మీడియా సెన్సేషన్ దువ్వాడ మాధురి ఈ చిత్రంలో భాగం కావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
స్టార్ పవర్తో ప్రారంభమైన ముహూర్తం
ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు అగ్ర తారలు హాజరై సందడి చేశారు. ముహూర్తపు షాట్కు స్టార్ హీరోయిన్ సమంత క్లాప్ కొట్టి చిత్ర బృందానికి తన ఆశీస్సులు అందించారు. టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తొలి షాట్కు దర్శకత్వం వహించగా, 'బింబిసార' దర్శకుడు వశిష్ట కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నందిని రెడ్డి, బి.వి.ఎస్ రవి, సీనియర్ నటి గౌతమి తదితరులు స్క్రిప్ట్ను అందజేసి చిత్ర యూనిట్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
వెండితెరపై దువ్వాడ మాధురి సందడి
ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలలో ఒకటి దువ్వాడ మాధురి. సోషల్ మీడియా ద్వారా నిత్యం వార్తల్లో నిలిచే ఆమె, ఈ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేస్తున్నారు. ఇందులో ఆమె పాత్ర కేవలం అతిథిగా కాకుండా, కథను మలుపు తిప్పే ఒక విభిన్నమైన , కీలకమైన పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఆమె నటన సినిమాకు ఒక ప్రత్యేక క్రేజ్ను, వినోదాన్ని జోడిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
బలమైన టెక్నికల్ టీమ్.. కొత్త దర్శకుడు
నటుడిగా 'శుభం' సినిమా , 'కుమారి శ్రీమతి' సిరీస్తో మెప్పించిన గవిరెడ్డి శ్రీనివాస్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. వై.ఎన్. లోహిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో 'సిన్సిల్యా' ఫేమ్ బ్రిగిడా సాగా నాయికగా నటిస్తోంది. విలేజ్ టాకీస్ బ్యానర్పై శ్రీను నాగులపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు సెంథిల్ కుమార్ కెమెరా పనితనం, ఏ.ఎస్. ప్రకాష్ ఆర్ట్ దర్శకత్వం ఈ సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చనున్నాయి.
నవ్వుల విందు.. ఆగస్టులో విడుదల
నలుగురు యువ రచయితలు దివ్య తేజస్వి, విక్రమ్ కుమార్, నాగ్, ఏకలవ్య కలిసి ఈ చిత్రానికి అత్యంత వినోదభరితమైన కథ, స్క్రీన్ప్లేను అందించారు. పీఆర్ మ్యూజిక్ అందిస్తున్న సంగీతం, తిరుపతి జవాన సాహిత్యం యువతను ఆకట్టుకోనున్నాయి. ప్రస్తుతం నర్సీపట్నం మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పక్కా కామెడీ కథాంశంతో వస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.




