కన్నీటి పర్యంతమైన హేమమాలిని, కూతురు అహానా.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో!

Dharmendra: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అత్యంత వైభవంగా జరిగింది.

Srinivas Rao
Published on: 26 May 2026 3:44 PM IST
Dharmendra
X

కన్నీటి పర్యంతమైన హేమమాలిని, కూతురు అహానా.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో!

Dharmendra: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 131 మంది ప్రముఖులకు గౌరవప్రదమైన పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఈ వేడుకలో ఆరు దశాబ్దాలకు పైగా భారతీయ సినిమాకు ఎనలేని సేవలు అందించి, గతేడాది కన్నుమూసిన లెజెండరీ నటుడు ధర్మేంద్రకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన ‘పద్మవిభూషణ్’ (మరణానంతరం) ప్రకటించింది.

రాష్ట్రపతి భవన్‌లో ఉద్వేగభరిత దృశ్యాలు

ధర్మేంద్ర తరపున ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించేందుకు ఆయన భార్య, సీనియర్ నటి హేమమాలిని, కుమార్తె అహానా డియోల్ ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ స్క్రోల్‌ను అందుకుంటున్న సమయంలో హేమమాలిని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వేదికపై తల్లి అవార్డు తీసుకుంటున్న దృశ్యాన్ని చూస్తూ కింద కూర్చున్న కుమార్తె అహానా డియోల్ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. చప్పట్లు కొడుతూనే ఆమె ఎమోషనల్ అయిన విజువల్స్ నెటిజన్లను సైతం కదిలిస్తున్నాయి. ధర్మేంద్రకు పద్మ పురస్కారం దక్కడం ఇది మొదటిసారి కాదు. గతంలో 2012లోనే ఆయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను ‘పద్మభూషణ్’ అవార్డును అందుకున్నారు.

https://twitter.com/PIB_India/status/2058877563687330239

90వ పుట్టినరోజుకు ముందే విషాదం

గత ఏడాది నవంబర్ 24న, తన 90వ పుట్టినరోజుకు కొన్ని రోజుల ముందే ధర్మేంద్ర శ్వాసకోశ సమస్యలతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఆయన మరణించినట్లు కొన్ని పుకార్లు రాగా, కుటుంబ సభ్యులు వాటిని ఖండించారు. అనంతరం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్న ఆయన, కుటుంబ సభ్యుల సమక్షంలోనే ప్రశాంతంగా కన్నుమూశారు. దాదాపు 65 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్ కలిగిన ధర్మేంద్ర నటించిన చివరి చిత్రం ‘ఇక్కిస్’ (Ikkis) ఆయన మరణానంతరం ఈ ఏడాది జనవరి 1న విడుదలైంది. ధర్మేంద్రకు మొదటి భార్య ప్రకాష్ కౌర్ ద్వారా బాలీవుడ్ స్టార్ హీరోలు సన్నీ డియోల్, బాబీ డియోల్ జన్మించగా.. హేమమాలిని ద్వారా ఈషా డియోల్, అహానా డియోల్ జన్మించారు.


Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story