Padma Awards 2026 : పద్మ పురస్కారాల్లో టాప్ అట్రాక్షన్ వీరే.!

Padma Awards 2026 : భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారాలైన ‘పద్మ అవార్డుల’ ప్రదానోత్సవ వేడుక దేశ రాజధాని న్యూఢిల్లీలో అత్యంత వైభవంగా జరగబోతోంది.

G Krishna
Published on: 25 May 2026 12:16 PM IST
padma awards 2026
X

padma awards 2026

Padma Awards 2026 : భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారాలైన ‘పద్మ అవార్డుల’ ప్రదానోత్సవ వేడుక దేశ రాజధాని న్యూఢిల్లీలో అత్యంత వైభవంగా జరగబోతోంది. సినిమా, సంగీతం, నాటకరంగాల్లో దేశ ప్రజలను దశాబ్దాలుగా అలరిస్తూ, తమ అసాధారణ ప్రతిభతో భారతీయ కళారంగానికి వన్నె తెచ్చిన పలువురు సినీ దిగ్గజాలను ఈ వారాంతంలో కేంద్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది.

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగే మొదటి పౌర పురస్కారాల (సివిల్ ఇన్వెస్టిచర్) వేడుకలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో 5 పద్మ విభూషణ్, 13 పద్మ భూషణ్ , 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. 1954లో ప్రారంభమైన ఈ పద్మ పురస్కారాలను కళలు, సాహిత్యం, క్రీడలు, సైన్స్, వైద్యం, సామాజిక సేవ , ప్రజా వ్యవహారాల వంటి వివిధ రంగాలలో విశేష కృషి చేసిన వారికి అందజేస్తారనే విషయం తెలిసిందే.

దివంగత ధర్మేంద్రకు 'పద్మ విభూషణ్'.. మమ్ముట్టికి 'పద్మ భూషణ్'

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న హిందీ సినిమా వెటరన్ స్టార్ ధర్మేంద్రను కేంద్ర ప్రభుత్వం మరణానంతరం దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మ విభూషణ్' తో గౌరవించింది. 'షోలే', 'చుప్కే చుప్కే', 'ఫూల్ ఔర్ పత్తర్' వంటి క్లాసిక్ చిత్రాలతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన ధర్మేంద్ర.. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరిగా నిలిచారు.

అలాగే, మలయాళ చలనచిత్ర పరిశ్రమను దశాబ్దాలుగా శాసిస్తున్న మెగాస్టార్ మమ్ముట్టిని ఈ ఏడాది 'పద్మ భూషణ్' పురస్కారం వరించింది. మలయాళంతో పాటు తమిళ, తెలుగు, హిందీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి, భారతీయ సినిమా రంగానికి చేసిన అపారమైన కృషికి గాను ఆయనకు ఈ గౌరవం దక్కింది. అంతకుముందు 1998లోనే ఆయనకు కేంద్ర ప్రభుత్వం 'పద్మశ్రీ' అవార్డును అందించింది.

ఆర్. మాధవన్, దివంగత సతీష్ షాకు 'పద్మశ్రీ'

తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులకు 'మ్యాడీ'గా ఎంతో సుపరిచితుడైన బహుముఖ ప్రజ్ఞాశాలి, నటుడు ఆర్. మాధవన్‌ను ఈ ఏడాది 'పద్మశ్రీ' పురస్కారానికి ఎంపిక చేశారు. 'రెహనా హై టెర్రే దిల్ మే', '3 ఇడియట్స్' వంటి చిత్రాలతో పాటు సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తానే స్వయంగా నటించి, దర్శకత్వం వహించిన 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' సినిమాతో ఆయన అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రానికి గాను మాధవన్ 2023లో జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నారు.

వీరితో పాటు, హిందీ టెలివిజన్, సినిమా రంగాల్లో తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో అందరినీ నవ్వించిన దివంగత నటుడు సతీష్ షాకు మరణానంతరం 'పద్మశ్రీ' అవార్డును ప్రకటించారు. 'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్', 'యే జో హై జిందగీ', 'ఎఫ్ఐఆర్' వంటి టీవీ సీరియల్స్ ద్వారా ఆయన ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యుడిగా మారిపోయారు. 'మెయిన్ హూ నా', 'హమ్ ఆప్కే హై కౌన్..!', 'ముజ్సే షాదీ కరోగి' వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు.

గాయని అల్కా యాగ్నిక్‌కు పద్మ భూషణ్.. బెంగాలీ స్టార్ ప్రోసేన్‌జిత్‌కు పద్మశ్రీ

భారతీయ సంగీత ప్రపంచంలో తన మధురమైన గొంతుతో 90ల కాలం నాటి శ్రోతలను ఉర్రూతలూగించిన ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ అల్కా యాగ్నిక్‌ను కేంద్ర ప్రభుత్వం 'పద్మ భూషణ్' పురస్కారంతో సత్కరించింది. దశాబ్దాలుగా చలనచిత్ర సంగీత రంగానికి ఆమె అందించిన సుదీర్ఘ సేవలకు గాను ఈ ఉన్నత గౌరవం దక్కింది.

మరోవైపు, బెంగాలీ చిత్ర పరిశ్రమలో తిరుగులేని సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రోసేన్‌జిత్ ఛటర్జీకి 'పద్మశ్రీ' పురస్కారం లభించింది. దాదాపు ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఆయన 350కి పైగా చిత్రాల్లో నటించి, బెంగాలీ సినిమాను అగ్రపథాన నిలిపారు.

కళారంగం నుండి మరికొందరు ప్రముఖులు

ప్రముఖ థియేటర్ , చలనచిత్ర నటుడు అనిల్ కుమార్ రస్తోగిని కూడా ఈ ఏడాది 'పద్మశ్రీ' పురస్కారంతో గౌరవించారు. నాటకరంగంతో పాటు ఆయన 'ఇషాక్‌జాదే', 'థప్పడ్', 'ముల్క్' వంటి బాలీవుడ్ చిత్రాలలో తన నటనతో మెప్పించారు. నటనతో పాటు సైన్స్ , అకడమిక్ రంగాలలో ఆయన చేసిన కృషికి గాను ఈ గుర్తింపు లభించింది.

అలాగే నాటకరంగం , చలనచిత్రాల్లో నటుడిగా, దర్శకుడిగా ఆరు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న సీనియర్ నటుడు అరవింద్ వైద్య కూడా ఈ ఏడాది 'పద్మశ్రీ' అందుకున్న వారి జాబితాలో ఉన్నారు. ఆయన ప్రస్తుతం దేశవ్యాప్తంగా బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన హిందీ సీరియల్ 'అనుపమ' (Anupamaa) లో హస్ముఖ్ "బాబూజీ" షా పాత్రలో నటిస్తూ ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. మొత్తానికి ఈ ఏడాది కళారంగానికి చెందిన ఎందరో అర్హులకు దేశ అత్యున్నత పురస్కారాలు దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story