Natty Kumar: ‘పెద్ది’ సినిమాను ఆపితే ఆమరణ దీక్షే.. ఆ నలుగురు ఆడిస్తున్న ఆటకు బలి కావద్దు..!

Natty Kumar: టాలీవుడ్‌లో ‘పెద్ది’ సినిమా వివాదం మరింత ముదిరింది. ఈ సినిమాను అడ్డుకోవాలని చూస్తే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని నిర్మాత నట్టి కుమార్ సంచలన హెచ్చరిక చేశారు.

Arun Chilukuri
Published on: 25 May 2026 2:21 PM IST
Natty Kumar
X

Natty Kumar: ‘పెద్ది’ సినిమాను ఆపితే ఆమరణ దీక్షే.. ఆ నలుగురు ఆడిస్తున్న ఆటకు బలి కావద్దు..!

Natty Kumar: టాలీవుడ్‌లో ‘పెద్ది’ సినిమా చుట్టూ ముసురుకున్న వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. ఈ వ్యవహారంపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించి ఇండస్ట్రీలోని కొందరు పెద్దలను ఉద్దేశించి అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా విడుదలను అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించిన ఆయన, టాలీవుడ్‌లో జరుగుతున్న అంతర్గత రాజకీయాలను ఒక్కొక్కటిగా ఎండగట్టారు.

ఆంధ్రప్రదేశ్ మరియు సీడెడ్ ప్రాంతాల్లో ఉన్న ఎగ్జిబిటర్లకు ఈ సినిమా వల్ల ఎలాంటి సమస్య లేదని నట్టి కుమార్ స్పష్టం చేశారు. జూన్ 3వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘పెద్ది’ సినిమా గ్రాండ్ ప్రీమియర్స్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

"‘పెద్ది’ సినిమా విడుదలను ఆపాలని ఎవరైనా కుట్రలు చేస్తే.. బుధవారం ఉదయం 10 గంటల నుంచి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నేను ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటా" అని నట్టి కుమార్ సంచలన ప్రకటన చేశారు. సినిమాను అడ్డుకోవడం వెనుక పెద్ద స్కెచ్ నడుస్తోందని ఆరోపించారు.

చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు.. ఆ నలుగురు ఎవరు?

ఈ వివాదం వెనుక మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని తొక్కేసే ప్రయత్నం జరుగుతోందని నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "బయటకు చిరంజీవి కుటుంబాన్ని మేము టార్గెట్ చేయడం లేదని చెబుతూనే.. లోపల మాత్రం కొందరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. అలా చేస్తున్న వాళ్లు ఎవరో మాకు బాగా తెలుసు" అని మండిపడ్డారు.

గతంలో మహేష్ బాబు, రవితేజ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి పెద్ద హీరోల సినిమాలకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు నోరు విప్పలేదు? అని ప్రశ్నించారు. ఒక్క ‘పెద్ది’ సినిమానే ఎందుకు కావాలని టార్గెట్ చేస్తున్నారని ఆయన నిలదీశారు.

ప్రస్తుతం వివాదాలు సృష్టిస్తున్న వారి వెనకాల ఉండి కొంతమంది కథ నడిపిస్తున్నారని నట్టి కుమార్ ఆరోపించారు. "ఆ నలుగురు ఆడిస్తున్న వెకిలి ఆటకు ఎవరూ బలి కావద్దు. ఒక సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే థియేటర్ల వద్ద పండగ వాతావరణం వస్తుంది, అందరూ బాగుంటారు. అంతే తప్ప కక్షగట్టి ఒక సినిమాను ఆపాలని అనుకోవడం చాలా తప్పు" అని ఆయన హితవు పలికారు.

నట్టి కుమార్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ టాలీవుడ్‌లో నెలకొంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story