Silk Smitha: సినీ రంగంలో సిల్క్‌స్మిత హిట్‌ కావడానికి ఈ ఒక్కటే కారణం

సిల్క్‌స్మిత పేరు ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. పెద్దగా అందచందాలు లేకున్నా... కేవలం మత్తెక్కించే కళ్లతోనే ఆమె సినీ రంగంలో తనకంటూ ఓ పేజీని సృష్టించుకుంది.

Balachander
Published on: 21 July 2026 2:21 PM IST
Silk Smitha: సినీ రంగంలో సిల్క్‌స్మిత హిట్‌ కావడానికి ఈ ఒక్కటే కారణం
X

Silk Smitha: గొప్ప నాట్యకళా నైపుణ్యం గానీ, దివ్యసుందర రూపురేఖలు గానీ లేకపోయినా.. కేవలం తన మత్తెక్కించే కళ్లతో, అయస్కాంతం లాంటి ఆకర్షణతో దశాబ్దాల పాటు దక్షిణ భారత చిత్రసీమను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఏకైక తార సిల్క్ స్మిత! 1980ల కాలంలో కనీసం ఒక్క పాటలోనైనా సిల్క్ స్మిత మెరిస్తేనే సినిమా థియేటర్లలో కాసుల వర్షం కురిసేది అంటే ఆమె సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఏలూరు సమీపంలోని ఒక పేద కుటుంబంలో విజయలక్ష్మిగా జన్మించి, నాల్గవ తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పి, టచ్‌అప్ ఆర్టిస్ట్‌గా మద్రాసులో అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే గ్లామర్ క్వీన్‌గా ఎదిగిన ప్రయాణం ఒక సంచలనం.

టచ్‌అప్ ఆర్టిస్ట్ నుండి వెండితెర సంచలనం వరకు

15 ఏళ్ల పిన్న వయస్సులోనే వివాహం జరగడం, అత్తవారింటి వేధింపులు తట్టుకోలేక ఇల్లు వదిలి పారిపోయిన విజయలక్ష్మి.. మద్రాసు చేరి సినీ రంగుల ప్రపంచంలో అడుగుపెట్టింది. తమిళ చిత్రం 'వండిచక్రం' తెలుగులో 'ఘరానా గంగులు', మలయాళంలో 'ఇనయె తేడీ' చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. 'సీతాకోకచిలుక'లో శరత్ బాబు భార్యగా, 'రోషగాడు'లో సీఐడీ పాత్రలో, 'బావా బావమరిది', 'ఆదిత్య 369' వంటి 100కు పైగా చిత్రాలలో కీలక పాత్రలలో నటించి తనలోని నటిని నిరూపించుకుంది. తెరపై మత్తెక్కించే చూపులతో జనాన్ని మైమరిపించినా, నిజ జీవితంలో సిల్క్ స్మిత అత్యంత అమాయకమైన, పసిపిల్లల లాంటి మనస్తత్వం కలిగిన మనిషి. ఆమె జీవిత ఆధారంగా 2011 డిసెంబర్ 2న బాలీవుడ్‌లో నిర్మించిన 'ద డర్టీ పిక్చర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.

జ్యోతిలక్ష్మి, జయమాలిని వంటి అగ్ర నర్తకీమణులు ఉన్న కాలంలో వచ్చి, తనకంటూ ఒక ప్రత్యేక బాణీని ఏర్పరచుకుని ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఆమె నేడు మన మధ్య లేకపోయినా, బుల్లితెరపై ఆమె రూపం కనిపిస్తే చాలు నేటికీ అభిమానులు కళ్లు తిప్పుకోకుండా చూస్తుండటమే ఆమె అసలైన గెలుపు! ఇలాంటి గెలుపు కొందరికే సాధ్యమౌతుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story