Trisha: త్రిష పుట్టినరోజు కానుక: ‘విశ్వంభర’లో అవనిగా.. ‘వీరభద్రుడు’లో ప్రీతిగా.. అప్డేట్ల జాతర!
Trisha: దక్షిణాది వెండితెర రాణి త్రిష నేడు తన 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె అభిమానులకు డబుల్ ధమాకా లాంటి వార్తలు అందుతున్నాయి.
Trisha
Trisha: దక్షిణాది వెండితెర రాణి త్రిష నేడు తన 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె అభిమానులకు డబుల్ ధమాకా లాంటి వార్తలు అందుతున్నాయి. అటు మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’, ఇటు సూర్య ‘వీరభద్రుడు’ చిత్రాల నుంచి క్రేజీ అప్డేట్లు రావడంతో సోషల్ మీడియాలో త్రిష నామస్మరణ మారుమోగిపోతోంది. ఆమె కొత్త పాత్రల విశేషాలు ఇవే!
‘విశ్వంభర’లో ‘అవని’గా త్రిష మెరుపులు
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. త్రిష పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది. ఇందులో ఆమె ‘అవని’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. "మీరు ఈ విశ్వంలో భాగం కావడం మాకు ఎంతో ప్రత్యేకం" అంటూ దర్శకుడు వశిష్ఠ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అషికా రంగనాథ్ కూడా మరో కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘వీరభద్రుడు’లో లాయర్ ప్రీతిగా సందడి
మరోవైపు, కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కరుప్పు’ చిత్రాన్ని తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో త్రిష ‘ప్రీతి’ అనే న్యాయవాది పాత్రలో నటిస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో త్రిష లుక్ అదిరిపోయింది. చాలా కాలం తర్వాత సూర్య, త్రిష జోడీ వెండితెరపై మెరవనుండటం విశేషం. ఈ యాక్షన్ డ్రామా మే 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.
తిరుమల శ్రీవారి చెంత బర్త్ డే వేడుకలు
వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న త్రిష, తన పుట్టినరోజు వేళ ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆదివారం రాత్రే తిరుమలకు చేరుకున్న ఆమె, సోమవారం ఉదయం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సాధారణ దుస్తుల్లో స్వామివారిని దర్శించుకున్న ఆమెను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. తన అభిమాన నటిని చూసిన సంతోషంలో అభిమానులు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి.
కొనసాగుతున్న విజయయాత్ర
రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అగ్రస్థానంలో కొనసాగడం త్రిషకే సాధ్యమైంది. పొన్నియిన్ సెల్వన్ తర్వాత ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభర, సూర్యతో వీరభద్రుడు మాత్రమే కాకుండా మరికొన్ని భారీ ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. 40 ఏళ్ళు దాటినా అదే గ్లామర్, నటనతో కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ 'సౌత్ క్వీన్' అనిపించుకుంటోంది. ఈ ఏడాది ఆమె ఖాతాలో మరిన్ని విజయాలు చేరాలని సినీ ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.




