Suryapet: గుప్తనిధుల ముఠా పట్టివేత.. 8 మందికి కటకటాలు!
Suryapet: సూర్యాపేట జిల్లా ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సమీపంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న 8 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Suryapet: గుప్తనిధుల ముఠా పట్టివేత.. 8 మందికి కటకటాలు!
సూర్యాపేట: చివ్వెంల మండలం ఉండ్రుగొండలో గుప్తనిధుల కోసం అక్రమ తవ్వకాలు జరుపుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పురాతన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లోని కేషరాజు కుంట కట్ట వద్ద తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో చివ్వెంల పోలీసులు దాడి చేశారు.
ఈ నెల 6వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు 10 మంది అనుమానాస్పదంగా తిరుగుతుండగా గుర్తించి, 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నిధుల వేటకు ఉపయోగించే మెటల్ డిటెక్టర్, స్కానర్, లొకేటర్, 6 సెల్ ఫోన్లు, ఒక ట్యాబ్, ఒక డ్యూయట్ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.
ఆలయ చైర్మన్ చకిలం కృష్ణ కుమార్ ఫిర్యాదు మేరకు చివ్వెంల ఎస్ఐ వి.మహేశ్వర్ కేసు నమోదు చేశారు. సూర్యాపేట రూరల్ సీఐ జి.రాజశేఖర్ ఆధ్వర్యంలో నిందితులను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
అరెస్టయిన వారు: పచ్చిపాల మధు, యల్లాల శ్రీకాంత్, భూతరాజు శివ, నకిరేకంటి గోపి, చర్లపల్లి ప్రణయ్ కుమార్, రాపాని తిరుపయ్య, కడారి సైదులు, భూక్యా తులశ్య.
గుప్తనిధుల పేరుతో మోసపోవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.




