Kodad: గీత కార్మికులారా.. వెంటనే కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోండి
Kodad: కోదాడలో గీత కార్మికుల పెన్షన్ల దరఖాస్తుపై గౌడ సంఘం జాతీయ అధ్యక్షుడు కేఎల్ఎన్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు. నిబంధనలను సరళతరం చేయాలని అధికారులకు విజ్ఞప్తి.
Kodad: గీత కార్మికులారా.. వెంటనే కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోండి
కోదాడ: అర్హులైన గీత కార్మికులందరూ కొత్త పెన్షన్ల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కౌండిన్య గౌడ సంఘం జాతీయ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది కే.ఎల్.ఎన్. ప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం కోదాడలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మికుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ గ్రామాల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఈ మేరకు గీత కార్మికులకు పెన్షన్లు అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరియు కోదాడ శాసనసభ్యురాలు ఎన్. పద్మావతి రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే కాలంలో బడుగు, బలహీన వర్గాలన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరించే అధికారులకు కే.ఎల్.ఎన్. ప్రసాద్ కీలక సూచనలు చేశారు.
ఐడీ కార్డులు కలిగిన వయస్సు ఉన్న వారు ఆ కార్డు పొందిన నాటి తేదీ (డేట్) ప్రకారమే అర్హతను పరిగణించాలని కోరారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో అధికారులు కార్డు మీద ఉన్న వయసును బట్టి ప్రస్తుతం అర్హులు కారని చెప్పి, వేరే సర్టిఫికెట్లు తేవాలని ఇబ్బంది పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
అలాంటి నిబంధనలతో ఇబ్బంది పెట్టకుండా, రిజిస్ట్రేషన్ చేసుకుని ఐడీ కార్డు పొందిన నాటి తేదీ ఆధారంగానే అర్హత కల్పించాలని ఆయన అధికారులను కోరారు. ఈ విలేకరుల సమావేశంలో గౌడ సంఘం జిల్లా నాయకులు గాలి శ్రీనివాస్ గౌడ్, కొంపెల్లి మంగయ్య గౌడ్, బాలేబోయిన సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.




