Nakrekal: నకిరేకల్ కొనుగోలు కేంద్రాల్లో ఎమ్మెల్యే వీరేశం ఊహించని తనిఖీలు
Nakrekal: నకిరేకల్ మండలం తాటికల్, మంగళ్ పల్లి, ఇనుపాముల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Nakrekal: నకిరేకల్ కొనుగోలు కేంద్రాల్లో ఎమ్మెల్యే వీరేశం ఊహించని తనిఖీలు
నకిరేకల్: రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, అన్నదాతలు ఎలాంటి అధైర్యానికి గురికావద్దని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం భరోసా ఇచ్చారు. శనివారం ఆయన నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం తాటికల్, మంగళ్ పల్లి, అలాగే కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ, రైతులకు కల్పించిన వసతులు, మిల్లులకు ధాన్యం తరలింపు వంటి అంశాలను అధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం కేంద్రాల వద్ద ఉన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ ఉంచిందని, తూకం వేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని స్పష్టం చేశారు. కొన్ని ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే కొనుగోళ్లపై కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జూన్ నెల వచ్చినా ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా సాగని విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో రైతు పక్షపాత ప్రభుత్వమని కొనియాడారు. దళారుల ప్రమేయం ఉండొద్దు..
కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద దళారుల ప్రమేయం అస్సలు సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. రైతుల నుంచి ఎవరైనా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. కేంద్రాల నిర్వాహకులు నిబంధనల ప్రకారం కొనుగోళ్లు జరపాలని, రైతులకు ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే తన దృష్టికి గానీ, అధికారుల దృష్టికి గానీ తీసుకురావాలని సూచించారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల అధికారులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.




