Kanagal: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కృత్రిమ కరువు!
Kanagal: నల్గొండ జిల్లా కనగల్ మండలం తిమ్మన్నగూడెంలో ఎండిపోయిన పంటలను మాజీ మంత్రి జగదీశ్రెడ్డి పరిశీలించారు
Kanagal: కాంగ్రెస్ ప్రభుత్వ ముందస్తు ప్రణాళికారాహిత్యం, నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కృత్రిమ కరువు ఏర్పడిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం తిమ్మన్నగూడెంలో సాగునీరందక ఎండిపోయిన పంట పొలాలను ఆయన ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దెబ్బతిన్న పంటలను చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, రైతులకు ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. సాగునీటి నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సమయానికి నీళ్లు విడుదల చేయకపోవడంతోనే పంటలు చేతికి అందకుండా పోయాయని, రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని మండిపడ్డారు. తక్షణమే ఎండిన పంటలకు ఎకరాకు నష్టపరిహారం అందించి, అన్నదాతలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.




