Miryalaguda: పూజ వివాదంతో పురోహితుడి మృతి.. మిర్యాలగూడలో భారీ ర్యాలీ!
Miryalaguda: చింతలపాలెంలో వినాయక పూజ వివాదంతో పురోహితుడు దత్తాత్రేయ శర్మ గుండెపోటుతో మృతి.
Miryalaguda: పూజ వివాదంతో పురోహితుడి మృతి.. మిర్యాలగూడలో భారీ ర్యాలీ!
మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా చింతలపాలెం గ్రామంలో వినాయక చవితి పూజ వివాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో మనస్తాపానికి గురైన పురోహితుడు దత్తాత్రేయ శర్మ గుండెపోటుతో కన్నుమూశారు. ఈ ఘటనను నిరసిస్తూ, ఆయన కుటుంబానికి మద్దతుగా మిర్యాలగూడలో పురోహితులు పెద్దఎత్తున వీధులకెక్కారు. ఫ్లై ఓవర్ నుంచి రాజీవ్ చౌక్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.
ఏ పాపం ఎరుగని అమాయక పురోహితుడు దత్తాత్రేయ శర్మ మృతికి కారణమైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో పూజారులపై ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం స్పందించాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలోనే 'పురోహితుల రక్షణకు ప్రత్యేక చట్టం' తీసుకురావాలని బిగ్గరగా నినాదాలు చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని స్థానిక అధికారులను కోరారు.




