Suryapet: సూర్యాపేట ఎస్పీ నరసింహ మానవీయత
Suryapet: సూర్యాపేట ఎస్పీ కార్యాలయంలో పనిచేసే దంపతులకు ప్రజావాణిలో సమాన గౌరవం. బాధితులకు అండగా నిలిచిన ఎస్పీ నరసింహ. ప్లాట్ మోసంపై విచారణకు ఆదేశం.
Suryapet: సూర్యాపేట ఎస్పీ నరసింహ మానవీయత
సూర్యాపేట: జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చే ప్రతి బాధితుడికి చట్టం ముందు సమాన గౌరవం, మర్యాద దక్కుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ మరోసారి నిరూపించారు. ఎస్పీ కార్యాలయంలోనే తాత్కాలిక ప్రాతిపదికన రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న స్వీపర్, స్కావెంజర్ దంపతులు గురువారం బాధితులుగా ప్రజావాణికి వచ్చారు. వారిని ఇతర ఫిర్యాదుదారుల మాదిరిగానే ఎస్పీ ఎదురుగా కూర్చోబెట్టి, ఓపిగ్గా వారి సమస్యను విన్నారు.
షకీరా బేగం, షేక్ షఫీ దంపతులు ఇద్దరూ జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వీపర్, స్కావెంజర్గా విధులు నిర్వహిస్తున్నారు. సూర్యాపేట పట్టణంలో ఒక ప్లాట్ కొనుగోలు విషయంలో తాము తీవ్రంగా మోసపోయామని వారు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. లేని ప్లాట్ను ఉన్నట్లు చూపించి డబ్బులు తీసుకున్నారని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
సాధారణంగా ప్రజావాణికి వచ్చే బాధితులను ఎంతో మర్యాదగా ఆదరించే ఎస్పీ నరసింహ, తన కార్యాలయంలోనే పనిచేసే సిబ్బంది బాధితులుగా వచ్చినా అదే గౌరవాన్ని కొనసాగించారు. వారికి ధైర్యం చెబుతూ, ఈ మోసంపై వెంటనే విచారణ జరిపి న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
"బాధితులెవరైనా మాకు సమానమే" అంటూ ఎస్పీ ఇచ్చిన భరోసాతో దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. పదవి, హోదాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం ఇవ్వాలనే సందేశాన్ని ఈ ఘటన ద్వారా ఎస్పీ నరసింహ తెలియజేశారు.




