Suryapet: రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి సూర్యాపేట కలెక్టర్

Suryapet: ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున వరి తగ్గಿಸಿ ఆరుతడి పంటలు వేయాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచన.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 23 July 2026 8:28 PM IST
Suryapet
X

Suryapet: రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి సూర్యాపేట కలెక్టర్

సూర్యాపేట: ఎల్ నినో ప్రభావంతో ఈ వానాకాలంలో వర్షాలు తగ్గే అవకాశం ఉందని, భూగర్భ జలాలు కూడా పడిపోతున్నాయని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు వరి సాగును తగ్గించి, తక్కువ నీటితో అధిక లాభం ఇచ్చే ఆరుతడి పంటలను ఎంచుకోవాలని సూచించారు.

గురువారం జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. ఐఎండి అంచనాల ప్రకారం దక్షిణ భారతంలో ఈసారి వర్షాలు తక్కువగా ఉంటాయని, అందుకే ఏప్రిల్ 27 నుంచి మే 23 వరకు "రైతు ముంగిట్లో శాస్త్రవేత్త" కార్యక్రమం ద్వారా, జూన్ 3 నుంచి 12 వరకు గ్రామ సభల ద్వారా రైతులకు ఇప్పటికే అవగాహన కల్పించామని చెప్పారు.

వరికి ఎక్కువ నీరు, ఆరుతడికి తక్కువ

వరి ఒక ఎకరాకు 44 నుంచి 55 లక్షల లీటర్ల నీరు కావాలని, పత్తికి 24 నుంచి 28 లక్షల లీటర్లు సరిపోతుందని వివరించారు. కందులు, పెసలు, మినుములకు 11 నుంచి 14 లక్షల లీటర్లు, జొన్న, సజ్జలు, రాగులు, కొర్రలు, నువ్వులు వంటి చిరుధాన్యాలకు ఇంకా తక్కువ నీరు అవసరమని తెలిపారు.

జిల్లాలోని నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ స్టేజి-2, మూసి ప్రాజెక్టు, 1071 చెరువుల్లో నీటి లభ్యత తక్కువగా ఉందని, 54 ఐడిసి లిఫ్టులు నడిచే పరిస్థితి లేదని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం తాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇప్పటివరకు సాగు ఇలా

జూలై 18, 2026 నాటికి జిల్లాలో సాగు వివరాలు:

- పత్తి: సాధారణంగా 97,566 ఎకరాలు ఉండగా, ఇప్పటివరకు 81,607 ఎకరాల్లో వేశారు

- వరి: సాధారణంగా 4,73,656 ఎకరాలు ఉండగా, ఇప్పటివరకు 46,361 ఎకరాల్లో మాత్రమే వేశారు

- మొత్తం: వానాకాలంలో 5,80,729 ఎకరాల లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు 1,30,504 ఎకరాల్లోనే సాగు జరిగింది

ఆగస్టు 15 వరకు వర్షాలు ఇలాగే ఉంటే తక్కువ కాలంలో పండే చిరుధాన్యాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో 11 రకాల చిరుధాన్యాలతో పాటు కూరగాయల విత్తనాలు 1,45,202.99 ఎకరాలకు సరిపడా ఉన్నాయి. అవసరం 29,254.07 క్వింటాళ్లు కాగా, 33,486 క్వింటాళ్ల స్టాక్ సిద్ధంగా ఉందన్నారు.

ఎరువుల కొరత లేదు

2026కు 1,28,183 మెట్రిక్ టన్నుల యూరియా, డిఎపి, కాంప్లెక్స్ తదితర ఎరువులు అవసరం కాగా, ఇప్పటివరకు 44,357 మెట్రిక్ టన్నులు అమ్మగా, 26,763 మెట్రిక్ టన్నులు అదనంగా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పంట మార్పిడి వల్ల భూసారం పెరుగుతుందని, ఆర్థిక నష్టం తగ్గి లాభాలు వస్తాయని కలెక్టర్ తేజస్ రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు సాగు చేసి "వ్యవసాయం దండగ కాదు పండగ" అనేలా ముందుకు వెళ్లాలని కోరారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story