Suryapet: అక్టోబర్ 1న కొత్త ఓటర్ల తుది జాబితా.. కలెక్టర్ క్లారిటీ!
Suryapet: సూర్యాపేట జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కీలక సమీక్ష నిర్వహించారు.
Suryapet: అక్టోబర్ 1న కొత్త ఓటర్ల తుది జాబితా.. కలెక్టర్ క్లారిటీ!
సూర్యాపేట: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు బీఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ సహకరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జూన్ 18న బీఎల్ఓలు, అసెంబ్లీ స్థాయి అధికారులకు సన్నాహక శిక్షణ ఇస్తామని తెలిపారు.
జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసి, 2002 ఓటర్ల జాబితా ఆధారంగా కుటుంబ వివరాలు సేకరిస్తారని పేర్కొన్నారు. జూలై 24-30 వరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో 1,200 మంది ఓటర్లు ఉండేలా హేతుబద్ధీకరణ చేపడతామన్నారు.
జూలై 31న ముసాయిదా జాబితా ప్రచురించి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం అక్టోబర్ 1న తుది జాబితా విడుదల చేస్తామని వెల్లడించారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారి పేర్లను నేరుగా తొలగించకుండా నోటీసు ఇచ్చి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రస్తుత జాబితాలో పేరు లేని కొత్త ఓటర్లు ఫామ్-6, ప్రాంతం మారిన వారు ఫామ్-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 01-10-2026 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటుకు అర్హులని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, డీఆర్వో డి. ప్రేమ్ రాజ్, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ(ఎం), బీఎస్పీ ప్రతినిధులు పాల్గొన్నారు.




