Suryapet: సూర్యాపేట వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Suryapet: ఎల్ నినో ప్రభావంతో తక్కువ వర్షాలు కురిసే అవకాశం. ప్రాజెక్టుల్లో తగ్గిన నీటి నిల్వలు. పంటల మార్పిడి, స్వల్పకాలిక రకాల సాగుపై రైతులకు అధికారుల సూచనలు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 11 July 2026 9:50 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేట వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సూర్యాపేట: ఎల్ నినో ప్రభావంతో ఈ ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో సూర్యాపేట జిల్లా యంత్రాంగం రైతులకు కీలక సూచనలు జారీ చేసింది. జూలై తొలి రోజుల్లోనే వర్షపాతం చాలా తక్కువగా నమోదైనందున సాగు ప్రణాళికలను అత్యంత జాగ్రత్తగా రూపొందించుకోవాలని అధికారులు కోరారు. జిల్లాకు సాగునీరు అందించే ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయని నీటిపారుదల శాఖ సమీక్షలో తేలింది.

ప్రాజెక్టుల్లో నీటి పరిస్థితి ఇలా ఉంది:

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్: జిల్లాలోని 2,29,961 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తుంది. 312.05 టిఎంసిల సామర్థ్యానికి ప్రస్తుతం 138.21 టిఎంసిలే నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి 180 టిఎంసిలు ఉండగా 23.22% తగ్గుదల నమోదైంది. దీంతో ఖరీఫ్‌కు ఖచ్చితమైన నీటి సరఫరాకు హామీ ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేశారు.

ఎస్ఆర్ఎస్పి స్టేజ్-II: 2,13,175 ఎకరాలకు నీరందిస్తుంది. 24.034 టిఎంసిల సామర్థ్యంలో ప్రస్తుతం 5.70 టిఎంసిలే ఉన్నాయి. గతేడాది 6.19 టిఎంసిలు ఉంది. ఇక్కడ కూడా ఖచ్చితమైన విడుదలపై హామీ లేదు.

మూసి ప్రాజెక్ట్: 30,000 ఎకరాల ఆయకట్టుకు 4.460 టిఎంసిల సామర్థ్యంలో 3.54 టిఎంసిలు నిల్వ ఉంది. ప్రస్తుత నిల్వలు సరిపోయినా నీటిని పొదుపుగా వాడాలని సూచించారు.

వరి సాగు ప్రధానంగా ఈ మూడు కాల్వల వ్యవస్థలపైనే ఆధారపడి ఉండటంతో, సాగునీటి లభ్యత అనిశ్చితంగా ఉన్న ప్రాంతాల్లో రైతులు పంటల మార్పిడి, శాస్త్రీయ ప్రణాళిక అవలంబించాలని వ్యవసాయ శాఖ సూచించింది. అక్కడక్కడా కురిసే వర్షాలను చూసి విత్తనాలు వేయొద్దని, వాస్తవ వర్షపాతం, వాతావరణ అంచనాలు, నీటి లభ్యతను పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలని కోరింది.

తక్కువ నీటితో పండే పంటలకు ప్రాధాన్యం

బోరు, బావులపై ఆధారపడే రైతులు ఎక్కువ కాలం తీసుకునే వరి రకాలను నివారించి, ఆర్‌ఎన్‌ఆర్, హెచ్‌ఎమ్‌టి, జెజిఎల్, జై శ్రీరామ్, డబ్ల్యుజిఎల్-44, కేఎన్ఎమ్-1638, కేఎన్ఎమ్-7715 వంటి స్వల్పకాలిక వరి రకాలను సాగు చేయాలని సలహా ఇచ్చారు. సాగునీటి లేని చోట వరికి బదులు కందులు, పెసర్లు, మినుములు, బొబ్బర్లు, ఉలవలు, కూరగాయల పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

అత్యవసర పంటల సలహా

జిల్లా యంత్రాంగం వర్షాల సమయాన్ని బట్టి ఈ వ్యూహాన్ని పాటించాలని సూచించింది:

జూలై 15 లోపు వర్షాలు వస్తే: నీటి వసతి ఉన్నవారు స్వల్పకాలిక వరి, ఇతరులు కందులు, పెసర్లు సాగు చేయవచ్చు.

జూలై 16-30 మధ్య వర్షాలు వస్తే: దీర్ఘకాలిక వరి వద్దు. కందులు, బొబ్బర్లు, ఉలవల వైపు వెళ్లాలి. భూగర్భ జలం ఉన్నా స్వల్పకాలిక వరికే పరిమితం కావాలి.

ఆగస్టు 15 వరకు ఆలస్యమైతే: ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులు కందులు, బొబ్బర్లు, ఉలవలు, కూరగాయలు సాగు చేయాలి.

ఆగస్టు 15 తర్వాత వర్షాలు వస్తే: సాగును స్వల్పకాలిక, తక్కువ నీటి పంటలకే పరిమితం చేయాలి.

నీటి పొదుపు పద్ధతులు అవసరం

ఉద్యానవన శాఖ అందుబాటులో ఉన్న తేమను కాపాడుకోవడానికి బిందు సేద్యం, తుంపర్ల సేద్యం, మల్చింగ్, వర్షపు నీటి నిల్వ, ఫామ్ పాండ్లు, సమతుల్య ఎరువుల వినియోగాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించింది. నీటి లభ్యత ఉన్న చోట ఆయిల్ పామ్ సాగును కూడా పరిశీలించవచ్చని తెలిపింది.

నష్టాలను తగ్గించుకుని స్థిరమైన దిగుబడులు సాధించాలంటే క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంచుకోవాలని జిల్లా యంత్రాంగం రైతులకు విజ్ఞప్తి చేసింది.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story