Suryapet: గణేష్ మండపాలకు పోలీస్ అనుమతి తప్పనిసరి.. ఎస్పీ నరసింహ!
Suryapet: సూర్యాపేట జిల్లాలో వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ముందస్తు పోలీసు అనుమతి తప్పనిసరి. రహదారులపై మండపాలు పెట్టవద్దని ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశం.
Suryapet: గణేష్ మండపాలకు పోలీస్ అనుమతి తప్పనిసరి సూర్యాపేట ఎస్పీ నరసింహ!
Suryapet: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ సూచించారు. అందరూ కలిసిమెలిసి ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు.
శనివారం జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గణేష్ మండపాలను ఏర్పాటు చేసే ఉత్సవ కమిటీలు, భక్తులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని, సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు.
రోడ్లపై మండపాల ఏర్పాటు చేయవద్దని సూచించారు. రోడ్లపై మండపాలు ఏర్పాటు చేయడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని, అత్యవసర సేవల వాహనాలకు కూడా ఆటంకం కలుగుతుందన్నారు.
ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవడం, సమాచారం ఇవ్వడం వల్ల మండపాల వద్ద భద్రతా చర్యలను పోలీసులు పర్యవేక్షిస్తారని తెలిపారు. అవసరమైన చోట పగలు, రాత్రి పోలీస్ బీట్లు, పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే పోలీసుల వద్ద వివరాలు నమోదు చేయడం ద్వారా ఏర్పాటు చేసిన ప్రతి గణపతి విగ్రహానికి ప్రత్యేక నంబర్ కేటాయిస్తామని, నిమజ్జనం సమయంలో ఏ రోజు, ఏ మార్గంలో వెళ్లాలి అనే విషయాలపై పోలీసుల నుంచి అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు అందిస్తామన్నారు.
"మీ భద్రత - మా బాధ్యత, పోలీసులతో సహకరించండి, సురక్షితంగా గణేష్ ఉత్సవాలను జరుపుకోండి" అని ఎస్పీ కోరారు. ఉత్సవ కమిటీలు పోలీసులతో సమన్వయం చేసుకుని నిబంధనలు పాటిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు.




