Suryapet: ఇందిరమ్మ ఇళ్లతోనే పేదల సొంతింటి కల: రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
Suryapet: సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పాల్గొన్నారు.
Suryapet: ఇందిరమ్మ ఇళ్లతోనే పేదల సొంతింటి కల: రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
సూర్యాపేట: ఇళ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు కట్టించి ఇవ్వడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలో లబ్ధిదారులు తంతేనపల్లి నిర్మల, జానయ్య దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పి పదేళ్లు ఊరించినా ఒక్కరికీ పక్కా ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. ప్రతీ ఏడాది నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున మంజూరు చేసి అర్హులైన ప్రతి పేదవాడికి దశలవారీగా పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.
"ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతోంది. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే మా ప్రజా ప్రభుత్వ ద్వేయం" అని సర్వోత్తమ్ రెడ్డి పేర్కొన్నారు. గత పాలకులు డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదలకు నిజమైన న్యాయం జరుగుతోందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాలి మమత నాగరాజు, మాజీ సర్పంచ్ మారేపల్లి ప్రభాకర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మామిడి తిరుమలేష్, వార్డు సభ్యులు సారిపల్లి మంగయ్య, పేరం మంగయ్య, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, సూర్యాపేట మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలిమినేటి అభినయ్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు వెన్న మధుకర్ రెడ్డి, గుగులోతు నాగు నాయక్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.




