Suryapet: రైతులు అధైర్య పడొద్దు.. సూర్యాపేట ఎస్పీ భరోసా
Suryapet: అకాల వర్షాల నేపథ్యంలో రైతులు నష్టపోకుండా వరి ధాన్య సేకరణ, తరలింపును వేగవంతం చేయాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు.
Suryapet: రైతులు అధైర్య పడొద్దు.. సూర్యాపేట ఎస్పీ భరోసా
Suryapet: అకాల వర్షాల వల్ల రైతులకు నష్టం జరగకుండా వరి ధాన్యం తరలింపు, సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ అధికారులు, మిల్లర్లకు సూచించారు. రైతులు అధైర్య పడవద్దని, జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మంగళవారం సూర్యాపేట రూరల్ పరిధిలోని జాతీయ రహదారి 65పై టేకుమట్ల వద్ద ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు రవాణా వాహనాల సమకూర్పు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ట్రాన్స్పోర్ట్, రెవెన్యూ, సివిల్ సప్లై శాఖల అధికారులతో కలిసి లారీ యజమానులు, డ్రైవర్లతో మాట్లాడి త్వరితగతిన ధాన్యం తరలించేందుకు సహకరించాలని కోరారు.
అనంతరం చివ్వేంల మండల పరిధిలోని నవరత్న ఫార్ బాయిల్డ్ రైస్ మిల్ వద్ద ధాన్యం దిగుమతి, సేకరణను పరిశీలించారు. అకాల వర్షాలకు కల్లాల్లో ధాన్యం తడిచే ప్రమాదం ఉన్నందున మిల్లర్లు సేకరణలో వేగం పెంచాలని, ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయాలని సూచించారు. చిన్న తరహా మిల్లర్లు కూడా ముందుకు రావాలని కోరారు.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పోలీస్, రవాణా, రెవెన్యూ, సివిల్ సప్లై శాఖలు సమన్వయంగా పనిచేసి వాహనాలను సమకూరుస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నందున ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు, స్థానిక ఎస్ఐలు బాలు నాయక్, మహేష్ పాల్గొన్నారు.




