Air India Flight : ఢిల్లీలో ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఊపిరి పీల్చుకున్న 160 మంది
Air India Flight : బెంగళూరు నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్లో మంటల సిగ్నల్ రావడంతో ఢిల్లీ ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలోని 160 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.
Air India Flight
Air India Flight : బెంగళూరు నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. విమానం గాల్లో ఉండగానే ఇంజిన్లో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. విమానం ఇంజిన్లో మంటలు అంటుకున్నట్లు (ఇంజిన్ ఫైర్ ఇండికేషన్) కాక్పిట్లోని అలారమ్ సిగ్నల్స్ ఇవ్వడంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. గురువారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో ఈ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఎయిర్ ఇండియా యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, పైలట్లు, సిబ్బంది ప్రామాణిక నిర్వహణ విధానాలను పాటించి ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారని వెల్లడించింది.
బెంగళూరు నుంచి ఢిల్లీకి వస్తున్న AI 2802 ఎయిర్ ఇండియా ఫ్లైట్ దాదాపు గమ్యస్థానానికి చేరుకుంది. మరికొద్ది నిమిషాల్లో ఢిల్లీ ఎయిర్పోర్టులో రన్వేపై దిగాల్సి ఉంది. సరిగ్గా అదే సమయంలో విమానం ఎయిర్పోర్ట్ పరిధిలోకి ప్రవేశిస్తుండగా కాక్పిట్లో ఉన్న పైలట్లకు ఇంజిన్ నుంచి ఫైర్ ఇండికేషన్ సిగ్నల్స్ వచ్చాయి. ఇంజిన్లో మంటలు వచ్చే ప్రమాదం ఉందని అలారమ్ మోగడంతో విమానంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పైలట్లు వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు సమాచారం అందించి ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతి కోరారు.
డీజీసీఏ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఈ ఎయిర్ బస్ A320 విమానంలో ప్రమాద సమయంలో 160 మందికి పైగా ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది ఉన్నారు. పైలట్లు అద్భుతమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించి విమానాన్ని ఢిల్లీ రన్వేపై సురక్షితంగా దించడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే భద్రతా నిబంధనల ప్రకారం ప్రయాణికులను చాలా జాగ్రత్తగా విమానం నుంచి కిందకు దించి టెర్మినల్కు తరలించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ పూర్తి సురక్షితంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రతినిధి స్పష్టం చేశారు.
ఈ ఘోర ప్రమాదం ఎలా తప్పిందనే దానిపై ఎయిర్ ఇండియా యాజమాన్యం సీరియస్ అయింది. విమాన ఇంజిన్లో నిజంగానే మంటలు వచ్చాయా లేదా అది కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగిన తప్పుడు సిగ్నల్ (ఫాల్స్ అలారమ్) ఆ అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఏవియేషన్ నిపుణులు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారులతో కలిసి ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణను తక్షణమే ప్రారంభించినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇదొక అంతర్గత సాంకేతిక లోపంగా భావిస్తున్నప్పటికీ, పూర్తి నివేదిక వచ్చాకే అసలు కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు.




