Air India: ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఘటనపై దర్యాప్తులో ఎయిర్‌బస్

ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన ఘటనపై దర్యాప్తులో ఎయిర్‌బస్, ఫ్రాన్స్ బీఈఏ చేరాయి. 17 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Aug 2026 1:10 AM IST
Air India Phuket Delhi flight
X

Air India Phuket Delhi flight

ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమాన ఘటనపై దర్యాప్తులో విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్, ఫ్రాన్స్‌కు చెందిన విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ బీఈఏ భాగస్వామ్యం కానున్నాయి. ఫుకెట్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎ320నియో విమానం 36,000 అడుగుల ఎత్తులో గాలి అల్లకల్లోలంలో చిక్కుకుని ఒక్కసారిగా 300 అడుగులు కిందకు పడిపోయింది. ఈ ఘటనలో విమానంలోని 17 మంది గాయపడ్డారు.

విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో ఈ ఘటనను తీవ్రమైన ఘటనగా వర్గీకరించింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ నిబంధనల ప్రకారం దర్యాప్తు సంస్థలకు ఎయిర్‌బస్ సాంకేతిక సహాయం అందిస్తోంది. దర్యాప్తుకు సహకరించేందుకు ప్రత్యేక నిపుణుల బృందాన్ని పంపుతున్నట్లు ఎయిర్‌బస్ తెలిపింది.

ఫ్రాన్స్‌కు చెందిన బీఈఏ కూడా దర్యాప్తులో పాల్గొంటోంది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ అనుబంధం-13 ప్రకారం విమానాన్ని డిజైన్ చేసిన లేదా తయారు చేసిన దేశం దర్యాప్తులో ప్రతినిధులను నియమించుకోవచ్చు. ఎ320 విమాన తయారీదారు అయిన ఎయిర్‌బస్ కూడా దర్యాప్తు అధికారులకు సాంకేతిక సహకారం అందించనుంది.

విమాన వ్యవస్థలను అర్థం చేసుకోవడం, సాంకేతిక సమాచారం, విమాన డేటాను విశ్లేషించడం వంటి అంశాల్లో ఎయిర్‌బస్ నిపుణులు సహాయం చేయనున్నారు. విమానం అకస్మాత్తుగా ఎత్తు మారడానికి దారితీసిన పరిస్థితులు, ఆ సమయంలో పైలట్లు తీసుకున్న చర్యలను కూడా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు.

విమానంలోని ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గాలి అల్లకల్లోలాన్ని ఎదుర్కొన్న సమయంలో విమానం ఎలా స్పందించింది, ఏవైనా సాంకేతిక వ్యవస్థలు లేదా హెచ్చరికలు పనిచేశాయా అనే అంశాలను ఈ రికార్డుల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఇద్దరు పైలట్లను డ్యూటీ రోస్టర్ నుంచి డీజీసీఏ తొలగించింది. ఢిల్లీ చేరుకున్న తర్వాత పైలర్లకు మానసిక ప్రభావం చూపే పదార్థాల వినియోగంపై పరీక్షలు నిర్వహించారు.

పైలట్ ఇన్ కమాండ్‌కు నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో ఫలితం ‘నెగెటివ్ కాదు’ గా వచ్చింది. దీంతో ఆ నమూనాను నిర్ధారణ పరీక్ష కోసం పంపినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది.

దర్యాప్తు, నిర్ధారణ పరీక్ష ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story