Akhilesh Yadav: ‘దీదీ.. మీరు ఓడిపోలేదు’: మమతా బెనర్జీకి అఖిలేష్ యాదవ్ ఓదార్పు..!
Akhilesh Yadav: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి తర్వాత మమతా బెనర్జీని కలిసిన అఖిలేష్ యాదవ్. దీదీకి నైతిక మద్దతు ప్రకటించిన ఎస్పీ చీఫ్. ఇండియా కూటమి బలోపేతంపై చర్చ.
Akhilesh Yadav: ‘దీదీ.. మీరు ఓడిపోలేదు’: మమతా బెనర్జీకి అఖిలేష్ యాదవ్ ఓదార్పు..!
Akhilesh Yadav: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) అనూహ్య ఓటమిని చవిచూసిన నేపథ్యంలో, ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సమాజ్ వాదీ పార్టీ (SP) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తన సంఘీభావాన్ని ప్రకటించారు. గురువారం కోల్కతాలోని మమత నివాసానికి వెళ్లిన అఖిలేష్.. ఆమెతో పాటు టీఎంసీ సెకండ్ ఇన్ కమాండ్ అభిషేక్ బెనర్జీతో భేటీ అయ్యారు.
ఎన్నికల ఫలితాల తర్వాత తీవ్ర నిరాశలో ఉన్న మమతా బెనర్జీకి అఖిలేష్ యాదవ్ నైతిక మద్దతు ఇచ్చారు. "దీదీ.. మీరు ఓడిపోలేదు" అంటూ ఆయన ఆమెను ఓదార్చినట్లు టీఎంసీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా అభిషేక్ బెనర్జీని ఉద్దేశించి మాట్లాడుతూ.. "మీరందరూ అద్భుతమైన పోరాటం చేశారు.. మీ శ్రమ అమోఘం" అని ప్రశంసించారు.
బెంగాల్లో మారుతున్న రాజకీయ పరిణామాలు మరియు తదుపరి కార్యాచరణపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. బీజేపీని ఎదుర్కోవడంలో విపక్షాల ఐక్యత అవసరమని, ‘ఇండియా’ (INDIA) కూటమిని మరింత బలోపేతం చేస్తామని మమతా బెనర్జీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పదవి నుంచి తప్పుకుంటున్నప్పటికీ, జాతీయ రాజకీయాల్లో కూటమి పక్షాన పోరాటం కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు.




