Amit Shah: వందేమాతరం వివాదం.. కాంగ్రెస్, సోనియా గాంధీపై అమిత్ షా ఫైర్..

Amit Shah: కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ గేయం 'వందేమాతరం' ఆలాపనను మధ్యలోనే నిలిపివేసేందుకు ప్రయత్నించారంటూ

G Krishna
Published on: 16 Aug 2026 3:22 PM IST
Amit Shah
X

Amit Shah: వందేమాతరం వివాదం.. కాంగ్రెస్, సోనియా గాంధీపై అమిత్ షా ఫైర్..

Amit Shah: కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ గేయం 'వందేమాతరం' ఆలాపనను మధ్యలోనే నిలిపివేసేందుకు ప్రయత్నించారంటూ కాంగ్రెస్ పార్టీ , సోనియా గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ పర్యటనలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ చేసిన ఈ "పాపాన్ని" దేశ ప్రజలు ఏమాత్రం క్షమించరని మండిపడ్డారు.

సోనియా గాంధీ వ్యాఖ్యలపై అమిత్ షా ఆగ్రహం

కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌లో వందేమాతరం ఆలాపన జరుగుతుండగా, ఆ పాటను ఆపివేయాలని సోనియా గాంధీ పార్టీ అధ్యక్షుడికి సూచించారని అమిత్ షా ఆరోపించారు. "టీవీల్లో ఈ దృశ్యాలను దేశమంతా చూసింది. సోనియా జీ, మిమ్మల్ని 140 కోట్ల మంది ప్రజలు గమనిస్తున్నారు. వందేమాతరాన్ని అసంపూర్తిగా నిలిపివేయాలని ఎలా అనుకుంటారు? కాంగ్రెస్ నాయకులు సిగ్గుపడాలి" అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు, వందేమాతరం రచయిత బంకిం చంద్ర ఛటోపాధ్యాయ అమర ఆత్మకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

'ఓటు బ్యాంకు రాజకీయం కోసమే కాంగ్రెస్ ఇలా చేస్తోంది'

కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వందేమాతరం ప్రాముఖ్యతను విస్మరిస్తోందని అమిత్ షా విమర్శించారు. స్వాతంత్ర్య సంగ్రామంలో వేలాది మంది త్యాగధనులు వందేమాతరం పాడుతూ లాఠీ దెబ్బలు తిన్నారని, జైలు శిక్షలు అనుభవించారని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎర్రకోటతో సహా దేశవ్యాప్తంగా వందేమాతరం మార్మోగుతుంటే, కాంగ్రెస్ మాత్రం దానికి అవమానం కలిగిస్తోందని మండిపడ్డారు.

ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్

ఈ వివాదంపై బీజేపీ నేత అమిత్ మాల్వియా కూడా స్పందిస్తూ, పాట ముగియకముందే సోనియా గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారని, రాహుల్ గాంధీ కూడా ఆపమని సైగలు చేశారని ఆరోపించారు. అయితే, ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. జాతీయ గేయాన్ని ఆపడానికి సోనియా గాంధీ ప్రయత్నించలేదని, ఆ కార్యక్రమ నిర్వహణ సరైన పద్ధతిలో జరిగేలా చూడటానికే ఆమె మాట్లాడారని కాంగ్రెస్ నేతల ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు.

చిత్తోర్‌గఢ్‌లోని నింబహేరాలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ఆయన 21 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించారు. అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించి భారత్‌ను అణుశక్తి దేశంగా నిలిపిన ఘనత వాజ్‌పేయిదేనని కొనియాడారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story