Chopper Crash: లద్దాఖ్లో కూలిన ఆర్మీ చాపర్.. మృత్యుంజయులుగా నిలిచిన ముగ్గురు అధికారులు..
Chopper Crash: లద్దాఖ్లోని లేహ్లో భారత సైన్యానికి చెందిన ‘చీతా’ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ భయానక ప్రమాదం నుంచి లెఫ్టినెంట్ కల్నల్, ఇద్దరు మేజర్లు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
Chopper Crash: లద్దాఖ్లో కూలిన ఆర్మీ చాపర్.. మృత్యుంజయులుగా నిలిచిన ముగ్గురు అధికారులు..
Chopper Crash: లద్దాఖ్ సరిహద్దుల్లోని లేహ్ పర్వత ప్రాంతాల్లో భారత సైన్యానికి చెందిన ఓ ‘చీతా’ హెలికాప్టర్ (Cheetah Helicopter) ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ముగ్గురు సైనికాధికారులు ఈ భయంకర ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మే 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సాంకేతిక లోపం కారణంగానే హెలికాప్టర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి కూలిపోయినట్లు ఆర్మీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.
ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పాడైపోయినప్పటికీ, అందులోని లెఫ్టినెంట్ కల్నల్, ఇద్దరు మేజర్లు స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడటం విశేషం. అయితే, ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే ఘటనా స్థలానికి చేరుకున్న మేజర్ జనరల్ సచిన్ మెహతా.. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన మిగిలిన ఇద్దరు అధికారులతో కలిసి ఓ సెల్ఫీ తీసుకున్నారు. మృత్యువు అంచుల్లోకి వెళ్లి నవ్వుతూ తిరిగి వచ్చిన ఈ ఆర్మీ అధికారుల 'విక్టరీ సెల్ఫీ' ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది. నెటిజన్లు వీరి ధైర్యానికి సలాం కొడుతున్నారు.
భారత సైన్యం (Indian Army), వాయుసేన (IAF) దశాబ్దాలుగా రక్షణ అవసరాల కోసం, ముఖ్యంగా ఎత్తైన పర్వత ప్రాంతాలకు సరుకులు, సిబ్బందిని చేరవేయడానికి చీతా, చేతక్ హెలికాప్టర్లను ఎక్కువగా వినియోగిస్తున్నాయి. అయితే, ఈ పాత హెలికాప్టర్లలో ఆధునిక టెక్నాలజీ, అధునాతన సేఫ్టీ ఫీచర్లు లేకపోవడం వల్ల ఇవి తరచూ సాంకేతిక సమస్యలకు లోనై ప్రమాదాలకు గురవుతున్నాయి.
సైనిక వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో, ఈ పాత తరం హెలికాప్టర్లను పూర్తిగా పక్కన పెట్టి.. వాటి స్థానంలో సరికొత్త మోడరన్ టెక్నాలజీ కలిగిన హెలికాప్టర్లను రంగంలోకి దించడానికి కేంద్ర రక్షణ శాఖ వేగంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.




