Assam Flood: నీట మునిగిన అస్సాం.. 101 మంది మృతి.. నిరాశ్రయులైన 1.26 లక్షల మంది

Assam Flood: అస్సాంలో తీవ్ర వరదల కారణంగా మరణాల సంఖ్య 101కి చేరింది. 10 జిల్లాల్లోని 1.26 లక్షల మందికి పైగా ప్రజలు వరద ప్రభావానికి గురికాగా, గోలాఘాట్ జిల్లా అత్యధికంగా దెబ్బతింది.

CR Reddy
Published on: 11 Aug 2026 6:46 AM IST
Assam Flood
X

Assam Flood

Assam Flood: ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో భారీ వర్షాలు, వరదల ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో నీటిమట్టం స్వల్పంగా తగ్గుతున్నప్పటికీ ముంపు ముప్పు మాత్రం తప్పులేదు. తాజాగా అస్సాం వరద నివేదికల ప్రకారం.. ఈ వర్షభీభత్సానికి, వరద సంబంధిత ఘటనల్లో మరణించిన వారి సంఖ్య ఏకంగా 101కి చేరుకుంది. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో దాదాపు 1,26,431 మంది ప్రజలు ఈ ప్రళయం వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యారు.

విపత్తు నిర్వహణ శాఖ నివేదిక వివరాలు

అస్సాం విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 25 రెవెన్యూ సర్కిళ్లు, 458 గ్రామాలు నీటమునిగాయి. నిరాశ్రయులైన వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలివెళ్తున్నారు. గోలాఘాట్ జిల్లా వరదల వల్ల అత్యంత దారుణంగా దెబ్బతింది. ఒక్క గోలాఘాట్ జిల్లాలోనే 71,061 మంది బాధితులు ఉన్నారు. దాని తర్వాత శివసాగర్‌లో 21,600 మంది, నగావ్‌లో 16,908 మంది, జోర్హాట్‌లో 13,166 మంది వరద ముంపులో చిక్కుకున్నారు. వీటితో పాటు చరాయిదేవ్ (2,539), కర్బీ ఆంగ్లాంగ్ (852), దర్రాంగ్ (305) జిల్లాల్లో కూడా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

తీవ్రంగా ప్రభావితమైన ప్రధాన జిల్లాలు

రాష్ట్రంలో వరద ముంపునకు గురైన 10 ప్రధాన జిల్లాల్లో నగావ్, గోలాఘాట్, శివసాగర్, హోజాయ్, దర్రాంగ్, కర్బీ ఆంగ్లాంగ్, లఖింపూర్, కాచర్, చరాయిదేవ్, జోర్హాట్ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. నిత్యావసర వస్తువుల లభ్యత కష్టంగా మారడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ, నదుల్లో నీటిమట్టాలు ఇంకా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో సవాళ్లు ఎదురవుతున్నాయి.

ప్రభుత్వ సహాయక చర్యలు

అస్సాంలో ప్రతి ఏటా వర్షాకాలంలో వరదలు రావడం సర్వసాధారణమే అయినప్పటికీ, ఈసారి నమోదైన వర్షపాతం, వరుసగా పెరిగిన ప్రాణనష్టం యంత్రాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. బాధితులకు అవసరమైన ఆహారం, తాగునీరు, వైద్య సహాయం అందించడానికి జిల్లా యంత్రాంగం రెస్క్యూ టీమ్‌లతో సహాయక చర్యలను వేగవంతం చేసింది. రాబోయే రోజుల్లో వర్ష సూచనను బట్టి అస్సాంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయా లేదా ముప్పు మరింత పెరుగుతుందా అనేది ఆధారపడి ఉంటుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story