Ayodhya: అయోధ్య రామ మందిరంలో వైభవంగా సీతారాముల కల్యాణం
Ayodhya: అయోధ్య రామ మందిర చరిత్రలోనే తొలిసారిగా తెలంగాణ సాధు పరిషత్ సారథ్యంలో సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది.
Ayodhya: అయోధ్య రామ మందిరంలో వైభవంగా సీతారాముల కల్యాణం
అయోధ్య: అయోధ్య క్షేత్రంలో సీతారాముల కల్యాణ మహోత్సవం బుధవారం భక్తిశ్రద్ధల మధ్య కమనీయంగా జరిగింది. అయోధ్య చరిత్రలో తొలిసారిగా నిర్వహించిన ఈ కల్యాణోత్సవానికి తెలంగాణ సాధు పరిషత్ సారథ్యం వహించింది. లోకకళ్యాణం, ధర్మరక్షణ లక్ష్యాలతో ఛత్రపతి శివాజీ పీఠాధిపతి శ్రీ బైలూరి యోగేష్ ప్రభు పరిషత్ అధ్యక్షుడు శ్రీ శంకర్ స్వామీజీ, ఆధ్వర్యంలో వేడుకలు వైభవంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అయోధ్య నగర మేయర్ గిరీష్ పతి త్రిపాఠి, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి పట్నం సునీతా మహేందర్ రెడ్డి హాజరయ్యారు. వారు సీతారాముల వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
అనంతరం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ఆలయ పూజారి సత్యనారాయణ దాస్జీతో పాటు తెలంగాణకు చెందిన పూజారులు విశ్వనాథ్ రాజు, మణిదీప్, సుకేష్ శర్మ, రాంబాబు సంప్రదాయబద్ధంగా కల్యాణ క్రతువును నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన కొలన్ మౌనిక బాల్ రెడ్డి, మణిద్వీప్, రవికిరణ్, సత్యనారాయణ రాజు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆలయ ప్రోటోకాల్ అధికారులు వారికి బాల రాముల వారి ప్రత్యేక దర్శనం కల్పించారు. ప్రపంచంలో శాంతి, సౌభ్రాతృత్వం, ధర్మం వర్ధిల్లాలని ఈ సందర్భంగా నిర్వాహకులు ఆకాంక్షించారు.




